రామానుజాచార్యులవారి బ్రహ్మోత్సవాలు- 12 రోజుల పాటు: కంప్లీట్ షెడ్యూల్ ఇదే..!!
హైదరాబాద్ శంషాబాద్ సమీపంలో ముచ్చింతల్ లో మరోసారి ఆధ్యాత్మిక వేడుకలు జరుగున్నాయి. రామానుజాచార్యుల వారి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అక్కడి ఆశ్రమంలో సమతా కుంభ్ 2023 పేరుతో బ్రహ్మోత్సవాలు జరుగను
హైదరాబాద్: హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో గల త్రిదండి చినజీయర్ స్వామివారి ఆశ్రమంలో 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగి ఏడాది పూర్తవుతోంది. గత సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా ఈ సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది.
ఆధ్యాత్మికోత్సవాలు..
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముచ్చింతల్ ఆశ్రమంలో పెద్ద ఎత్తున ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. రామానుజులవారి బ్రహ్మోత్సవాలు జరపడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమతా కుంభ్ 2023 పేరుతో ఆధ్యాత్మిక పండగను 10 రోజుల పాటు నిర్వహించబోతోన్నారు. అంకురార్పణతో ఆరంభం అయ్యే ఈ బ్రహ్మోత్సవాలు.. స్వామివారి రథోత్సవం, చక్రస్నానంతో పూర్తవుతాయి.
వివరాలివే..
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ముచ్చింతల్ ఆశ్రమ నిర్వాహకులు త్రిదండి చినజీయర్ స్వామి దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ మేరకు ఆశ్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 216 అడుగుల స్వర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించి అప్పుడే ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు. ఈ సంవత్సర కాలంలో దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది సమతా మూర్తి, ఆశ్రమాన్ని దర్శించుకున్నారని వివరించారు.
ఫిబ్రవరి 2 నుంచి..
తొలి ఏడాది పూర్తి కాబోతోన్నందున సమతా కుంభ్ పేరుతో వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని చినజీయర్ స్వామి తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 12వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా ఇవే తేదీల్లో బ్రహ్మోత్సవాలు జరుపుతామని తెలిపారు. శాస్త్రోక్తంగా అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని చెప్పారు.
సమతా కుంభ్ పేరుతో..
సమాజంలోని ప్రతి ఒక్కరూ సమానమే అనే స్ఫూర్తిని ప్రపంచం మొత్తానికీ చాటి చెప్పిన ఆ సమతా మూర్తి రామానుజాచర్యుల వారిని స్మరించుకుంటూ ఈ బ్రహోత్సవాలకు సమతా కుంభ్ పేరుతోనే వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని అన్నారు. ఆశ్రమానికి వచ్చే ప్రతి భక్తుడికీ తీర్థ ప్రసాదాలను అందజేస్తామని చెప్పారు.
కార్యక్రమాలు ఇవే..
ఫిబ్రవరి 2వ తేదీన విశేష ఉత్సవాలను నిర్వహించనున్నారు. 3వ తేదీన సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ, 4వ తేదీన సమతామూర్తికి కృతజ్ఞాంజలి కీర్తన, రామానుజ నూత్తాందిది సామూహిక పారాయణం, 5వ తేదీన రామానుజాచార్యులవారి విగ్రహానికి 108 రూపాల్లో శాంతి కల్యాణోత్సవం, 6వ తేదీన ఉదయం వసంతోత్సవం, సాయంత్రం 18 గరుడ సేవలు, 7వ తేదీన ఉదయం డోలోత్సవం, హనుమద్వాహన సేవ, 18 గరుడ సేవలను నిర్వహించనున్నారు.
పూర్ణాహూతితో..
8వ తేదీన కల్హరోత్సవం, సామూహిక పుష్పార్చన, సాయంత్రం 18 రూపాల్లో తెప్పోత్సవం, 9వ తేదీన రామానుజులవారికి వరివస్య, సాయంత్రం అశ్వ వాహన సేవ, 18 గరుడ సేవలు, 10వ తేదీన ఉదయం సామూహిక ఉపనయనాలు, సాయంత్రం గజవాహన సే, 18 గరుడ సేవలు, 11వ తేదీన ఉదయం రథోత్సవం, చక్రస్నానం, మధ్యాహ్నం విశ్వశాంతి విరాట్ గీతా పారాయణం, 12వ రోజున ఉత్సవం అంత్యస్నపనం, సాయంత్రం మహా పూర్ణాహూతి, కుంభప్రోక్షణలను నిర్వహించనున్నారు.