హిందూ ధర్మంపై అన్ని రకాల దాడులు జరుగుతున్నాయి: చినజీయర్స్వామి
హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులపై శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు
హైదరాబాద్: హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులపై శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఏ జాతికీ హాని తలపెట్టని హిందూ ధర్మంపై అన్ని రకాలుగా దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది తమ మతాన్ని ప్రచారం చేసుకునేందుకు కొత్త పోకడల్ని అనుసరిస్తూ సామాన్యుల్ని ప్రలోభ పెడుతున్నారని అన్నారు.
చినజీయర్ స్వామి
రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని, వేదాలను వక్రీకరిస్తున్నారని చినజీయర్ స్వామి అన్నారు. హిందూ దేవతామూర్తులను అశ్లీల పదాలతో విమర్శిస్తున్నారని చినజీయర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.
విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు
పథకం ప్రకారమే మతం పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని దుష్ట శక్తులు కుట్రలు పన్నుతున్నాయంటూ ఆరోపించారు. ఇతర ధర్మాలను కించపరచకుండా.. ఎవరికి వారు తమ మతాల గురించి నిరభ్యంతరంగా ప్రచారం చేసుకునే హక్కు ఉందన్నారు.
ప్రజల్ని మభ్యపెడుతున్నారు
కొందరు మత ప్రచారకులు భాగవతం, మహాభారతం, రామాయణం తదితర పవిత్ర గ్రంథాల్లో ఉన్న దేవుడు.. మా దేవుడూ ఒక్కటేనంటూ ప్రజల్ని మభ్య పెడుతున్నారని అన్నారు. అలాంటి కుట్రలను తిప్పి కొట్టి హిందూ ధర్మాన్ని సుస్థిరపరిచేందుకు వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత శాఖలకు చెందిన ధర్మాచార్యులంతా ఒకేతాటిపైకి వచ్చి ‘హిందూ ధర్మాచార్య ప్రతిష్ఠాన్' అనే సంస్థను ప్రారంభించినట్లుగా వివరించారు.
మీడియాతో మాట్లాడుతూ..
ఈ వివరాలను శ్రీ పరిపూర్ణానంద స్వామి(శ్రీ పీఠం), శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి(శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం, మంత్రాలయం)తో కలిసి గురువారం జూబ్లీహిల్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చినజీయర్ వెల్లడించారు.
పరిపూర్ణానంద స్వామి
‘హిందూ ధర్మ ప్రచార్' పేరిట కొంత మందికి శిక్షణ ఇచ్చి ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన ధార్మిక సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. భారతీయులందరినీ ఒకేతాటిపైకి తెస్తున్న వేదాలపై దాడి జరుగుతోందని శ్రీ పరిపుర్ణానంద స్వామి అన్నారు.
ఏ మతానికి వ్యతిరేకం కాదు
హిందూ ధర్మంపై జరిగే కుట్రలు, కుతంత్రాలను ‘హిందూ ధర్మాచార్య ప్రతిష్ఠాన్'వేదికగా తిప్పి కొడతామని స్పష్టం చేశారు. ఏ మతానికి వ్యతిరేకం కాదని.. హిందూ ధర్మం ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు కొత్త సంస్థకు శ్రీకారం చుడుతున్నట్లు శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి వివరించారు.