అందరికీ అందుబాటులో, మంచిపేరు: చినజీయర్ స్వామి శిష్యుడికి తప్పని ఓటమి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరు కనిపించింది. కారు జోరు ముందు బీజేపీ కూడా మసకబారింది. హైదరాబాదులో 2014లో ఐదు స్థానాలను బీజేపీ గెలవగా, ఈసారి గోషామహల్ నుంచి కేవలం రాజాసింగ్ లోథ్ మాత్రమే గెలిచారు. ఓడిన వారిలో చింతల రామచంద్రా రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు ఉన్నారు.
ఓడిన బీజేపీ నేతల్లో చినజీయర్ స్వామికి అథ్యంత విశ్వసనీయమైన వ్యక్తిగా ఉన్న చింతల కూడా ఓడిపోయారు. గత కొన్నేళ్లుగా చినజీయర్ స్వామికి హైదరాబాదులో అన్నీ అయి నిలబడ్డారు చింతల. దశాబ్దాలుగా చినజీయర్తో ఆయనకు అనుబంధం ఉంది.
చినజీయర్ ఏ కార్యక్రమం చేసినా దాదాపు ఆయనతోనే ఉండేవారు. ఆయన ప్రతి కార్యక్రమంలో ముందు ఉండేవారు. చింతల టీటీడీ బోర్డు మెంబర్గా అయ్యారంటే చినజీయర్ అండదండలతోనే అనే వాదన కూడా ఉంది. అలాంటి చింతల గెలుపు కోసం గతంలో చినజీయర్ భక్తులు, అనుచరులు పని చేశారని అంటారు.
కానీ అలాంటి చినజీయర్ స్వామి భక్తుడైన చింతల రామచంద్రా రెడ్డి కూడా ఓడిపోయారు. చింతలకు స్థానికంగా మంచి పేరు ఉంది. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరు సంపాదించారు.
తన నియోజకవర్గంలోని షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చింతల కూడా తన సొంత డబ్బులు కలిపి ఇచ్చేవారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుకు చింతల కూడా సొంతగా రూ.50వేలు కలిపి ఇవ్వడంతో పాటు తులం బంగారం, వెండి, పట్టు వస్త్రాలు ఇచ్చేవారు. తన నియోజకవర్గంలోని వెనుకబడిన ప్రాంతాల.. ముస్లీం ప్రాంతాలు సహా అభివృద్ధిపై దృష్టి సారించారు. అలాంటి నేతను, పైగా చినజీయర్ ఆశీస్సులు ఉన్న నేత గెలవలేకపోవడంపై చర్చించుకుంటున్నారు.