ప్రధాని మోదీని కలిసిన చినజీయర్,మైహోం రామేశ్వరరావు... సమతామూర్తి విగ్రహావిష్కరణకు ఆహ్వానం
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి,ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావుతో కలిసి శనివారం(సెప్టెంబర్ 18) ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్దీ ఉత్సవాలకు, సమతామూర్తి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని ప్రధాని మోదీని చినజీయర్ స్వామి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సహస్రాబ్ది మహోత్సవాల విశిష్టతను మోదీకి చినజీయర్ స్వామి వివరించారు. 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. చినజీయర్ ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందించిన మోదీ కార్యక్రమానికి తప్పక హాజరువతానని తెలిపారు.
మైహోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ప్రధానికి రామానుజ ప్రాజెక్టు వివరాలను తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. శంషాబాద్ ముచ్చింతల్లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో వచ్చే ఫిబ్రవరిలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 216 అడుగుల రామానుజాచార్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.మొత్తం 200 ఎకరాల్లో రూ.1000 కోట్లతో సమతామూర్తి దివ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు విగ్రహావిష్కరణ ఉత్సవాలు జరపనున్నారు. ఈ సందర్భంగా 35 హోమగుండాలతో ప్రత్యేక యాగం చేయనున్నారు. ఇందుకోసం 2లక్షల కిలోల ఆవు నెయ్యిని వినియోగించనున్నారు.
ఈ మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే చినజీయర్ స్వామి గత ఐదు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్,ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,కేంద్రమంత్రులు అమిత్ షా,రాజ్నాథ్ సింగ్,నితిన్ గడ్కరీ,కిషన్ రెడ్డి,అశ్విన్ చూబె, భూపేంద్ర యాదవ్,ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్,సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణనులను చినజీయర్ కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు.
సమతామూర్తి దివ్యక్షేత్రం
థాయ్లాండ్లో ఉన్న బుద్ద విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దది కాగా ముచ్చింతల్లో నిర్మించే రామానుజ విగ్రహం రెండో అతిపెద్దదిగా చెబుతున్నారు. భారత దేశంలో ఇదే అతిపెద్ద విగ్రహంగా చెబుతున్నారు. ఈ విగ్రహాన్ని పంచలోహాలతో చైనాలో తయారు చేయిస్తున్నారు. 1100 టన్నుల బరువుండే ఈ భారీ విగ్రహ ఏర్పాటు నిమి త్తం భద్రవేది పేరుతో పీఠం ఏర్పాటు చేస్తున్నారు. దానిపై పద్మపీఠం నిర్మిస్తున్నారు. పద్మపీఠంపై రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. మొత్తం నిర్మాణం ఎత్తు 216 అడుగులు కాగా.. ఇందులో భద్రవేది పీఠం ఎత్తు 54 అడుగులు, పద్మపీఠం ఎత్తు 27 అడుగులు, త్రిదండం పొడవు 135 అడుగులు ఉంటాయి. పద్మపీఠంలో రామానుజ విగ్రహం ఎత్తు 108 అడుగులు ఉంటుంది. 200 ఏళ్ల వరకూ చెక్కుచెదరకుండా ఉండేలా విగ్రహాన్ని తయారుచేయించి ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇది కాక.. రామానుజాచార్యులవారు ఈ భూమిపై 120 ఏళ్లు జీవించిన గుర్తుగా దివ్యక్షేత్రంలో 120 కిలోల బంగారు రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. అత్యాధునిక మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నారు. 108 దివ్యదేశాల (వైష్ణవ క్షేత్రాల) నమూనాలను ఇక్కడ నిర్మిస్తున్నారు. ఈ దివ్యక్షేత్ర నిర్మాణానికి అవసరమైన 45 ఎకరాల స్థలాన్ని మైహోం సంస్థ అధినేత రామేశ్వరరావు దానం చేశారు. మొదటి దశ పనులు నవంబర్ నాటికి పూర్తికానున్నాయి.