సర్జికల్ స్ట్రయిక్స్పై చినజీయర్ స్వామీజీ స్పందన, మోడీ పైనా..
హైదరాబాద్: మన ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్కు స్నేహహస్తం అందిస్తే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదలను రెచ్చగొడుతోందని చినజీయర్ స్వామి బుధవారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో అందరం జవాన్లకు అండగా నిలబడాల్సిన అవసరముందన్నారు. ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు.
గతంలో వాజపేయి లాహోర్కు బస్సులో ప్రయాణించి ఇరుగుపొరుగు వారితో సఖ్యత సాగాలని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్తో కలిసి ఉండాలని అప్పుడు వాజపేయి యాత్ర చేశారన్నారు. ఆ యాత్ర పూర్తయ్యాక మన దేశానికి లభించిన బహుమతి కార్గిల్ యుద్ధం అన్నారు.
షాక్: ఎల్వోసీ వద్ద పాకిస్తాన్ మానవ రహిత విమానాలు
ఇది అందరికీ తెలిసే ఉంటుందన్నారు. కార్గిల్ వార్ జరిగినప్పుడు దేశ రక్షణ కోసం పోరాడిన మన సైనికుల కోసం, వారి మనోధైర్యం కోసం ఏమైనా చేయాలనే ఉద్దేశ్యంతో సికింద్రాబాదులోని బైసన్ పోలో మైదానంలో 80వేల మందితో ఓ కార్యక్రమం చేశామన్నారు. ఆనాడు దీపాలు వెలిగించామన్నారు.
ఈ మధ్య భారత ప్రధాని మోడీ అదే సౌహార్ద్రంతోని (వాజపేయిలా) పాకిస్తాన్ పైన చూపించారన్నారు. పాక్ ఆహ్వానించనప్పటికీ అక్కడకు వెళ్లారని చెప్పారు. వారిని పలకరించారన్నారు. ఆ తర్వాత జరిగినది దురదృష్టకరమన్నారు. యూరి దాడికి ధీటుగా మన జవాన్లు స్పందించడం గర్వించదగ్గదన్నారు.
మనం గుండెమీద చేయి వేసుకొని ధైర్యంగా నిద్రపోగలుగుతున్నామంటే అందుకు సైనికులే కారణమన్నారు. సర్జికల్ స్ట్రయిక్ ద్వారా సైనికులు సరైన సమాధానం చెప్పారన్నారు. పొరుగు దేశాలతో సఖ్యతతో ఉండాలన్నదే భారత్ ఉద్దేశ్యమన్నారు.
ఇది నా దేశం అని భావించే ప్రతి వ్యక్తి.. కులమతాలకు అతీతంగా దీనిపై స్పందించాలన్నారు. మనం జవాన్లకు అండగా ఉండాలన్నారు. ఈ దేశ పౌరులకు ఓ అభ్యర్థన చేస్తున్నానని, వారికి కావాల్సిన తోడ్పాడును అందిస్తామన్నారు. మనం ధర్మం, దేశం.. రెండింటిని రక్షించుకోవాలన్నారు.
హిందు, క్రిష్టియన్, ఇస్లామిక్, బౌద్ధ, సిక్కు ధర్మాచార్యులు కూడా స్పందించాలన్నారు. మనం ఏకకంఠంతో జవాన్లకు అండగా నిలబడాలన్నారు. మతాలకు అతీతంగా దేశ రక్షణ ముఖ్యమన్నారు. మనం సరదా కోసం దీపావళి రోజు చిచ్చుబుడ్లు, కాకరవత్తులు కాల్చుతుంటామని చెప్పారు.
వాటి వల్ల కాలుష్యం కూడా అవుతుందన్నారు. కాబట్టి ఈ సరదా వదులుకోమని చెప్పను కానీ, కొద్దిగా తగ్గించి దానిని జవాన్ల సాయం కోసం వినియోగిద్దామన్నారు. కొత్త బట్టలు కొనుక్కోవడం కూడా తగ్గించి, జవాన్లకు ఉపయోగపడే విధంగా చూడాలన్నారు. మోడీ స్నేహ హస్తం అందిస్తే పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందన్నారు.