బాబు కాదు, కెసిఆర్ కాదు.. వైయస్సే!: చిన్నారెడ్డి, డిగ్గీతో నేతల భేటీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లే పాలమూరులో నాలుగు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి బుధవారం అన్నారు. వైయస్ సీఎంగా ఉన్నప్పుడు సదరు ప్రాజెక్టులు తుది దశకు వచ్చాయన్నారు.
ఏడాది కాలంగా కెసిఆర్ సర్కారు ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రాజెక్టులకు రూ.1000 కోట్లు కేటాయిస్తే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయని చెప్పారు. రుణమాఫీ జరగక, బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వక రైతులు వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్నారన్నారు. రుణమాఫీ తక్షణమే చేయాలన్నారు.
కాగా, పాలమూరు ప్రాజెక్టు పైన ఇప్పటికే తెలుగుదేశం, టిఆర్ఎస్ పార్టీల మధ్య వాదోపవాదాలు సాగుతున్నాయి. చంద్రబాబు తన హయాంలో పాలమూరు ప్రాజెక్టులను ఏం చేయలేకపోయారని టిఆర్ఎస్ చెబుతుండగా, బాబు హయాంలోనే అభివృద్ధి చెందిందని టిడిపి చెబుతోంది.
దీనిపై మంత్రి జూపల్లి కృష్ణా రావు, టిడిపి నేత రావుల చంద్రశేఖర రెడ్డిలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడుతోంది. రెండు రోజుల క్రితం డికె అరుణ కూడా మండిపడ్డారు.
డిగ్గీ రాజాతో కాంగ్రెస్ నేతల భేటీ
తెలుగు రాష్ట్రాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, జానా రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. డిగ్గీతో వీరు గంటకు పైగా భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ పర్యటన, తెలంగాణలో నేతల జంపింగ్ పైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.