ఈటెలను అధ్యక్షుడిని చేయగలరా?: కెసిఆర్కు చింతల సవాల్, జానాపై పాల్వాయి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్)పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు చింతల రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుటుంబ పాలనను మొదటి నుంచి బిజెపి వ్యతిరేకిస్తోందని, రాష్ట్రంలో కుటుంబపాలన తప్పని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఏమీ చేయట్లేదని ప్రచారం చేయటం సరికాదన్నారు.
ఆదివారం చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఇటీవల బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్న బహిరంగసభను చూసి టిఆర్ఎస్ ఓర్వలేక పోతుందని చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. అమిత్ షా వ్యాఖ్యలకు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర ఉలిక్కిపడి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
రూ. 90 కోట్లు కాదు, రూ. 1.16 లక్షల కోట్లు కేంద్రప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.ఈ అంశంపై తెలంగాణ అసెంబ్లీ లేదా ఫామ్ హౌస్లో అయిన బహిరంగ చర్చకు సిద్ధమని చింతల రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు.
తెలంగాణ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద కేంద్రం రూ.790 కోట్లు ఇచ్చిందని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి అయినా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. అన్ని విషయాలపై కేంద్రం స్పష్టమైన అవగాహనతో పనిచేస్తోందని పేర్కొన్నారు.
అంతేగాక, ఈటెల రాజేందర్ను టిఆర్ఎస్ అధ్యక్షుడిని చెయ్యగలరా? అని టిఆర్ఎస్ అధినేత, సీఎం కె చంద్రశేఖర్ రావుకు సవాల్ విసిరారు. ఫాంహౌస్ , సచివాలయంలో సీఎం కేసీఆర్ ఎన్ని రోజులు ఉన్నారో? శ్వేతపత్రం విడుదల చేయాలని చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేసిన కోదండరాంకు వ్యతిరేకంగా మంత్రులంతా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
జానారెడ్డిని డైరెక్ట్గా అనలేదు: పాల్వాయి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని విబేధాలు మరోసారి బయటపడ్డాయి. తమ పార్టీ నేతలు షబ్బీర్ అలీ, మల్లు రవిపై క్షమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పాల్వాయి ఆదివారం లేఖ రాశారు.
'సీఎల్పీ నేత జానారెడ్డి కోవర్టు' అని తాను నేరుగా అనలేదని పాల్వాయి లేఖలో పేర్కొన్నారు. షబ్బీర్ అలీ, మల్లు రవి తనను విమర్శించడం ద్వారా గీత దాటారని ఆరోపించారు. వారిద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల జరిగిన పరిణామాలపై హైకమాండ్ కు వివరణ ఇస్తానని పాల్వాయి తెలిపారు.