టాలీవుడ్ బాధ్యత మాదే, జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలోనూ స్థానం: చిరంజీవి, నాగార్జునతో కేసీఆర్
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ప్రముఖ సినీ నటులు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ్ దాస్ నారంగ్, కేఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి కళ్యాణ్, డిస్టిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, నిర్మాతల నిరంజన్ రెడ్డి సీఎంను కలిశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
సినీ పరిశ్రమకు రాయితీలు, మినహాయింపులు
కరోనా కారణంగా సినీ పరిశ్రమకు జరిగిన నష్టాన్ని సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరించారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ ఆగిపోయి, థియేటర్లు మూసివేయడం వల్ల సినీ పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.
టాలీవుడ్ను కాపాడుకోవడం మా బాధ్యత: కేసీఆర్
రాష్ట్రానికి పరిశ్రమలు తరలిరావడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని, అలాంటిది ఉన్న పరిశ్రమను కాపాడుకోకపోతే ఎలా? అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో ముంబై, చెన్నైతోపాటు హైదరాబాద్ నగరంలోనే పెద్ద సినీ పరిశ్రమ ఉందని చెప్పారు. లక్షలాది మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి దొరుకుతోందన్నారు.
సీని పరిశ్రమను ఆదుకోవడానికి అన్ని చర్యలు
కోవిడ్ కారణంగా సినీ పరిశ్రమకు ఇబ్బంది కలిగిందని.. ఈ పరిస్థితుల్లో పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం అన్నారు. ఇటు ప్రభుత్వం, అటు సినిమా పరిశ్రమ పెద్దలు కలిసి పరిశ్రమను కాపాడుకోవడానికి సంయుక్తంగా ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రభుత్వపరంగా సినీ పరిశ్రమను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్.
Recommended Video
జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలోనూ సినీ పరిశ్రమ అంశాలు..
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసే మేనిఫెస్టోలో సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా, త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి నివాసంలో మరోసారి సమావేశమై, సినీ పరిశ్రమ అభివృద్ధిపై మరింత విస్తృతంగా చర్చించాలని సినీ పెద్దలు నిర్ణయించారు.ఇటీవల కూడా చిరంజీవి, నాగార్జున సీఎం కేసీఆర్ను కలిసిన విషయం తెలిసిందే.