ఓటు వేసి చిరంజీవి, జూ.ఎన్టీఆర్ ఏం చెప్పారంటే? గాడిదతో సమానమని వ్యాఖ్య
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సినీ తారలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. చిరంజీవి, నాగార్జున, జూ.ఎన్టీఆర్, నాగబాబు, వరుణ్ తేజ, రాజమౌళి తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను మాట్లాడారు.
ఇక్కడ మాట్లాడను.. మా అక్క గెలవాలని కోరుకుంటున్నా
ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని నటుడు జూ.ఎన్టీఆర్ చెప్పారు. బాధ్యతగా అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. గతంతో పోలిస్తే యువత ఓటు హక్కును ఎక్కువగా వినియోగించుకుంటోందని చెప్పారు. పోలింగ్ బూత్ వద్ద తాను అభ్యర్థుల గురించి మాట్లాడలేనని ఆయన చెప్పారు. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న తన అక్క సుహాసిని గెలవాలని కోరుకుంటున్నానని చెప్పారు.
ఓటు హక్కు వినియోగంచుకున్న చిరంజీవి
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. ఓటు వేయడం ఎంతో ముఖ్యమని చెప్పారు. అయిదేళ్లకోసారి వచ్చే ఈ అవకాశాన్ని అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని చెప్పారు. తన కుటుంబ సభ్యులు అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారని, రామ్ చరణ్ తేజ విదేశాలకు వెళ్లడంతో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయాడని చెప్పారు.
ఓటు వేయకుంటే గాడిదతో సమానం
రాజ్యాంగం మనకు ఇచ్చిన ఆయుధం ఓటు అని నాగబాబు అన్నారు. మనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనుకుంటే ఓటరు చేతిలో ఉన్న ఆయుధం ఓటు హక్కు అని చెప్పారు. ఇది మన రాజ్యాంగ హక్కు, బాధ్యత అన్నారు. ఊళ్లో ఉండి, ఆరోగ్యంగా ఉండి కూడా ఓటు హక్కు వినియోగించుకోకుంటే వాడు గాడిదతో సమానమని చెప్పారు.
విజయశాంతి
అందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని యావత్ తెలంగాణను తాను కోరుకుంటున్నానని కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి అన్నారు. మంచి పార్టీని ఎన్నుకోవాలని, మీకు మంచి భవిష్యత్త ఉంటుందని ఆమె చెప్పారు. భారత పౌరుడుగా తన ఓటు హక్కును వినియోగించుకున్నానని డీజీపీ అన్నారు. పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు. ఉదయం ఏడు గంటల నించి శాంతియుతంగా జరుగుతోందని చెప్పారు.
అమిత్ షా ట్వీట్
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ట్వీట్ చేశారు. తెలంగాణ సోదర, సోదరీమణులు అందరూ ఓటు వేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు వస్తోందని పేర్కొన్నారు.
నరేంద్ర మోడీ ట్వీట్
తెలంగాణ రాష్ట్రంలోని ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా కోరారు. 'ఇవాళ ఎన్నికల రోజు అని, తెలంగాణలో ఉన్న సోదర సోదరీమణులు అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని కోరుతున్నానని, ప్రత్యేకించి తన యువ మిత్రులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు.
చంద్రబాబు ట్వీట్
తెలంగాణలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వేసే ప్రతి ఓటు ఎంతో మార్పు తీసుకు వస్తుందని గ్రహించాలని పేర్కొన్నారు.