చిలిపి చిరంజీవి: తమ్ముడు పవన్ కల్యాణ్ను ఆట పట్టించాడు
హైదరాబాద్: తమ్ముడు పవన్ కల్యాణ్ను మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఆట పట్టించారు. రాష్ట్రపతి కోవింద్కు గవర్నర్ నరసింహన్ రాజ్భవన్లో ఆదివారం సాయంత్రం ఇచ్చిన విందులో ఆ సంఘటన చోటు చేసుకుంది.
ఆ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి చిలిపి చిరంజీవి అనే శీర్షిక కూడా పెట్టారు. శీతాకాలం విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన గౌరవార్థం గవర్నర్ ఇచ్చిన విందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
వారిద్దరు కూడా వచ్చారు...
రాష్ట్రపతికి ఇచ్చిన విందులో చిరంజీవితో పాటు పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ ఎవరితోనో మాట్లాడుతుండగా చిరంజీవి వెనక నుంచి వచ్చారు. చిరంజీవి తన కుడితో పవన్ కల్యాణ్ను తట్టారు. దాంతో పవన్ కల్యాణ్ వెనక్కి తిరిగి చూశారు. ఆ సమయంలో ఏమీ ఎరగనట్లు చిరంజీవి తన ముందున్నవారితో మాట్లాడడం ప్రారంభించారు.
చిలిపి చిరంజీవి అంటూ..
తమ్ముడిని పలకరించినట్లే పలకరించి, ఆ తర్వాత అటు చూడకుండా చిరంజీవి దోబూచులాట ఆడారు. దాన్ని నెటిజన్లు చిరంజీవి చిలిపితనంగా అభివర్ణిస్తున్నారు. నెటిజన్లు షేర్ చేసిన వీడియోలో చిరంజీవి, పవన్ కల్యాణ్లతో పాటు నటుడు రానా కూడా ఉన్నారు.
Recommended Video
కెసిఆర్తో పవన్ కల్యాణ్ ముచ్చట
రాష్ట్రపతి కోసం గవర్నర్ ఇచ్చిన విందు కార్యక్రమంలో పవన్ కల్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పరస్పరం పలకరించుకున్నారు. కాసేపు ఇరువురు ముచ్చట కూడా పెట్టారు. వారిద్దరు ఏం మాట్లాడుకుని ఉంటారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కెసిఆర్
రాష్ట్ర విభజన సమయంలో పవన్ కల్యాణ్పై కెసిఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీని పెట్టిన తర్వాత కూడా కెసిఆర్ ఆయనపై వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ పార్టీకి ఒక శాతం ఓట్లు కూడా రావని కెసిఆర్ నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అన్నారు. విభేదాలను విస్మరించి వారిద్దరు మాట్లాడుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.