టీఆర్ఎస్ లో చేరి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన చిత్తరంజన్ దాస్ ...మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ కు కష్టమే
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు ఇస్తుంటే మొదట కంగారు పడినా ఇప్పుడు ఆ షాకులు మామూలైపోయాయి .పార్టీ నుండి వెళ్ళే వారిని ఆపే ప్రయత్నం కూడా విరమించుకున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు . లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెట్టి ఈసారైనా తమ సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీఆర్ ఎస్ పార్టీ నుండి కంటే పార్టీ మారుతున్న నేతల నుండే చాలా ఘాటు విమర్శలు ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
గులాబీ తీర్ధం పుచ్చుకున్న చిత్తరంజన్ దాస్
గత అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నుండి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతుంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రారంభమైన ఈ వలసలు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఓబిసి సెల్ మాజీ ఛైర్మన్ చిత్తరంజన్ దాస్ టీఆర్ఎస్ లో చేరారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని ఏంబీఏ గార్డెన్స్లో టీఆర్ఎస్ పార్టీ ప్రచార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో చిత్తరంజన్ దాస్ టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుత మంత్రి ఈ మాజీ మంత్రికి గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
మహబూబ్ నగర్ లో ఇద్దరు సీనియర్లు అవుట్ .. కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గడ్డు కాలమే
మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ కు మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గా మంచి గుర్తింపు ఉంది.అంతేకాకుండా గతంలో టీడీపీ అధినేత ఎన్టీఆర్ ను సైతం ఓడించిన చరిత్ర చిత్తరంజన్ దాస్ కు ఉంది. ఇలాంటి నేత పార్టీని వీడటం మహబూబ్ నగర్ కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బే అని తెలుస్తుంది. ఒక పక్క డీకే అరుణ వంటి సీనియర్ నాయకురాలు బీజేపీ లో చేరటం, మరోపక్క చిత్తరంజన్ దాస్ వంటి నాయకుడు టీఆర్ ఎస్ బాట పట్టటంతో కాంగ్రెస్ కు మహబూబ్ నగర్ జిల్లాలో లోక్ సభ ఎన్నికల్లో ఇబ్బందికర పరిణామాలు ఎదురు కానున్నాయి.
వీహెచ్ సెన్సేషన్ .. చంద్రబాబు పిలిస్తే ఏపీలో టీడీపీ కోసం ప్రచారం చేస్తారట
కాంగ్రెస్ కు తలనొప్పిగా చిత్తరంజన్ సోనియాకు రాసిన లేఖ
పార్టీ వీడి పోయిన నేతలు సైలెంట్ గా వెళ్ళక వయిలెంట్ కామెంట్స్ చేస్తున్నారు. చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సమయంలోనే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ ఆర్.సి. కుంతియాపై, నిజామాబాద్ లోకసభ కాంగ్రెసు అభ్యర్థి మధుయాష్కీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ చిత్తరంజన్ దాస్ సోనియా గాంధీకి లేఖ రాశారు.ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ కి తలనొప్పిగా మారుతున్నాయి.