నామా ఉదంతంపై చంద్రబాబు దాటవేత: రేవంత్ రెడ్డికి నో చాన్స్
ఒకే రోజు రెండు ఉదంతాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కుదిపేశాయి.
అమరావతి: ఒకే రోజు రెండు ఉదంతాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కుదిపేశాయి. తెలంగాణ పార్టీకి సంబంధించిన ఈ ఉదంతాలు చాలా తీవ్రమైనవే. ఒకటి, పార్టీకి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడం కాగా రెండోది నామా నాగేశ్వర రావుపై ఉదంతం.
నగ్న చిత్రాలను బయటపెడుతానంటూ తనను బెదిరించినట్లు సుంకర సుజాత అనే మహిళ నామా నాగేశ్వర రావుపై చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ సంఘటనపై చంద్రబాబు శనివారం మీడియా సమావేశంలో స్పందించారు.
ఒక రకంగా నామా నాగేశ్వర రావు ఉదంతంపై ఆయన సమాధానాన్ని దాట వేశారు. నామాపై హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే.
నామాపై చంద్రబాబు ఇలా.
నామా నాగేశ్వరరావు అంశం తన దృష్టికి రాలేదని చంద్రబాబు చెప్పారు. అయినా అది ఆయన వ్యక్తిగత వ్యవహారమని అన్నారు. దీనిపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని చెప్పారు. శనివారం తెలంగాణ టీడీపీ నేతలతో అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నామా నాగేశ్వర రావుతో తాను ఆ విషయంపై మాట్లాడలేదని చెప్పారు. నామాతో మరోసారి భేటీ అయి మాట్లాడుతానని చెప్పారు.
ఎసిపిని కలిసిన సుజాత
నామా నాగేశ్వరరావుపై కేసు నమోదు అంశంపై సుజాత సుంకర అనే మహిళ జూబ్లీహిల్స్ ఏసీపీని శనివారం మధ్యాహ్నం కలిశారు. తన నగ్న చిత్రాలు బయటపెడతానంటూ సుజాత సుంకర అనే మహిళ మాజీ ఎంపీ నామాపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో పోలీసులు నామా నాగేశ్వరరావుపైన, ఆయన తమ్ముడు సీతయ్యపైన రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మాట్లాడే అవకాశం ఇవ్వని చంద్రబాబు
రేవంత్రెడ్డికి చంద్రబాబు నాయుడు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. శనివారం మధ్యాహ్నం అమరావతిలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి ముఖ్యనేతలందరూ ఉదయమే వెళ్లగా రేవంత్రెడ్డి, వేం నరేందర్రెడ్డి మాత్రం మధ్యాహ్నం సమయంలో సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
చంద్రబాబుకు నమస్కారం పెట్టి...
తనకు చంద్రబాబు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు మీడియా సమావేశానికి హాజరయ్యారు. అయితే, తాను తర్వాత మాట్లాడుతానని మీడియా సమావేశానికి వచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. అయితే, రేవంత్ రెడ్డి వేచి చూడకుండా చంద్రబాబు పీఏకు రేవంత్రెడ్డి తన రాజీనామా లేఖను అందజేసి వెనుదిరిగారు. ఈ సమయంలో మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్న చంద్రబాబుకు రేవంత్రెడ్డి నమస్కారం పెట్టి బయటకు వచ్చారు. ఆ తర్వాత రేవంత్ నేరుగా హైదరాబాద్ బయలుదేరారు.