ఉద్రిక్తంగా చౌటుప్పల్ చైర్మన్ ఎన్నిక..ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల బాహాబాహీ..రాజగోపాల్ రెడ్డి అరెస్ట్
తెలంగాణా రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు ముగిశాయి . ఇక నేడు మున్సిపాలిటీలకు చైర్మన్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రం రణరంగాన్ని తలపిస్తోంది. మున్సిపల్ చైర్మన్ ఎంపిక తీవ్ర గందరగోళానికి దారి తీసింది. చౌటుప్పల్ మున్సిపాలిటీలో హంగ్ పరిస్థితుల నేపథ్యంలో మున్సిపాలిటీ కేంద్రం రణరంగంగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సీపీఎం కార్యకర్తలను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సీపీఎం టీఆర్ఎస్ కు మద్దతు
20 వార్డులున్న చౌటుప్పల్లో టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 5, బీజేపీ 3, సీపీఎం 3, స్వతంత్రులు ఒక చోట విజయం సాధించారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ బలం ఆరుకు చేరింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఎం టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీంతో సీపీఎం డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారిని అడ్డుకున్నారు.
ప్రమాణ పత్రాలను చించేసిన ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి
తమతో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం పట్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ప్రమాణ పత్రాలను చించేశారు. ఇక మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి , కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ కౌన్సిలర్లు చొక్కాలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో యుద్ధ వాతావరణం నెలకొంది .
సీపీఎం కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి.. ఫర్నీచర్ ద్వంసం
ముఖ్యంగా యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్, టీఆర్ఎస్లు హోరాహోరీగా మున్సిపల్ ఎన్నికల్లో తలపడ్డాయి . ఇక నేడు చైర్మన్ ఎంపిక సమయంలోనూ టీఆర్ఎస్ , కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు సీపీఎం కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. కార్యాలయంలోని అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
కొట్టుకున్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ... రాజగోపాల్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ నేపథ్యంలోనే నేడు చైర్మన్ ఎంపిక విషయంలో పెద్ద ఎత్తున ఇరు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మున్సిపాలిటీ కేంద్రం వద్ద కొట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో పోలీసులు ఆయనను బయటకు తీసుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులపై రాళ్లు రువ్వినట్టు తెలుస్తోంది.ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.