చుక్కా రామయ్యకు పద్మశ్రీ!: పద్మ అవార్డుల జాబితాలో పీవీ సింధు, సత్య నాదెళ్ల?
ఐఐటీ రామయ్యగా పేరు తెచ్చుకున్న చుక్కా రామయ్యకు ఈ యేడాది పద్మశ్రీ అవార్డు వరించినట్లు సమాచారం.
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఐఐటీ రామయ్యగా పేరు తెచ్చుకున్న చుక్కా రామయ్యకు ఈ యేడాది పద్మశ్రీ అవార్డు వరించినట్లు సమాచారం. ఆయనతోపాటు మరికొంత మందికి పద్మ అవార్డులు తెలుగు రాష్ట్రాల నుంచి లభించినట్లు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం 25మంది పేర్లతో కూడిన జాబితాను కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే.
ఇప్పటికే పద్మ అవార్డు విజేతల జాబితా సిద్ధం కాగా, బుధవారం మధ్యాహ్నం అధికారికంగా పేర్లను ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరం పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులను అందుకోబోయే వారిలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఉన్నతాధికారి సత్య నాదెళ్ళ, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, అమెరికాలోని సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ పేర్లు ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం.
వీరితో పాటు ఒలింపిక్స్ పతకం సాధించిన పీవీ సింధు, ఆమె కోచ్ గోపీచంద్, క్రికెటర్ ఎంఎస్ ధోనీ పేర్లు కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి 25 మంది పేర్లను పద్మ అవార్డుల నిమిత్తం కేంద్రానికి సిఫార్సు చేయగా, వీరిలో 10 మందిని అవార్డు కమిటీ ఎంపిక చేసినట్టు సమాచారం.
పీవీ సింధుతోపాటు చుక్కా రామయ్య, మోహన్ రెడ్డి, వహీద్ హనుమాన్ చౌదరిలకు అవార్డులు ఖరారైనట్టు సమాచారం. అవార్డుల జాబితాలో రచయిత సుక్రీ బొమ్మ గౌడ, పశ్చిమ బెంగాల్ జానపద గాయకుడు హిమ్రత్ సింగ్, ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ అలోక్ సాగర్ పేర్లున్నాయని తెలుస్తోంది.