అప్పుడే కేసీఆర్ అంటే ఏంటో అర్థమైంది, ఆ పిలుపు కోసం: సుమన్
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు సుమన్ గత కొంత కాలంగా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. తనకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు అంటే ఎంతో ఇష్టమని, ఆయన పిలిస్తే టీఆర్ఎస్ పార్టీలో చేరతానని కూడా ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.
తాను హైదరాబాద్కు వచ్చి 29ఏళ్లు అవుతోందని సుమన్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారని అన్నారు. ముఖ్యంగా తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా చేశారని అన్నారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారని కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు.
అప్పుడే కేసీఆర్ ఎంటో తెలిసింది
ఒకసారి సీఎం కేసీఆర్ పిలిస్తే వెళ్లానని, తనతో దాదాపు ఐదున్నర గంటలపాటు మాట్లాడారని చెప్పారు. ఆయనతో కలిసి భోజనం కూడా చేసినట్లు తెలిపారు. అంతేగాక, తనను కేబినెట్ సమావేశానికి కూడా తీసుకెళ్లారని చెప్పారు. అప్పుడే తనకు కేసీఆర్ అంటే ఎంటో అర్థమైందని, ఆయనకు అనేక అంశాలపై అమోఘమైన అవగాహన ఉందని అన్నారు. రాష్ట్రం కోసం కేసీఆర్ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని సుమన్ చెప్పారు. తెలుగు మహాసభలకు తన గురువును పిలిచి ఆయన పాదాల వద్ద కేసీఆర్ తన తలను పెట్టడం తనను కదిలించిందని, ఒక గురువును ఇంత గొప్పగా గౌరవించడం తనకు నచ్చిందని సుమన్ తెలిపారు.
కేసీఆర్ చరిత్ర సృష్టించారు
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. చిన్నవాళ్లను కూడా కేసీఆర్ గౌరవిస్తారని అన్నారు. డిప్యూటీ సీఎంలుగా ఒక ముస్లింను, దళితుడిని నియమించి కేసీఆర్ చరిత్ర సృష్టించారని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు.
కేసీఆర్ పిలుపు కోసం
తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, కేసీఆర్ తనను టీఆర్ఎస్లో చేరమంటే చేరుతానని, ఎన్నికల్లో పోటీ చేయమంటే చేస్తానని సుమన్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయవచ్చని, అయితే, వాటిని రుజువు చేయాలని అన్నారు. సినీ ఇండస్ట్రీకి ఇప్పటికే సీఎం కేసీఆర్ కొంత చేశారని.. స్థలాలు ఇచ్చారని.. ఇంకేమైనా ఉపయోపడే కార్యక్రమాలు చేపడితే మంచిదని అన్నారు. ఇండస్ట్రీకి ఏదైనా చేయాలని తాను సీఎంను కోరతానని సుమన్ అన్నారు.
అందుకే జై తెలంగాణ అన్నా..
ఇక్కడి ప్రజలకు తగిన న్యాయం జరగడం లేదనే తాను విభజనకు ముందు జై తెలంగాణ అని చెప్పినట్లు సుమన్ వ్యాఖ్యానించారు. తాను కరాటే ప్రోగ్రాంలలో పాల్గొనే క్రమంలో తెలంగాణ మొత్తం తిరిగానని చెప్పారు. తెలంగాణ ప్రజలు మంచివారని, అమాయకంగా ఉండేవారని.. ఏ రంగంలోనూ అవకాశాలు రావట్లేదని నిరాశ వారిలో ఉండేదని అన్నారు. అందుకే వారు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారని చెప్పారు.