హాస్య నటుడు వేణు మాధవ్ మృతి.. సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు..
హైదరాబాద్ : సినీ హాస్య నటుడు వేణుమాధవ్ అకాల మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేసారు. రాజకీయ నేతలతో పాటు సినీ తారలు వేణు మాధవ్ మృతిపట్ల దిగ్బ్రాంతిని వ్యక్తం చేసారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వేణు మాధవ్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్వం చేసారు. వేణుమాధవ్ పార్టీ కోసం అంకిత భావంతో పని చేసారని గుర్తు చేసారు. వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని, అందరినీ నవ్వించిన వేణుమాధవ్ ఇక లేరు అనే విషయం దిగ్భ్రాంతికి లోను చేసిందని అన్నారు.
హాస్య నటుడు వేణు మాధవ్ ఇక లేరు.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ సంతాపం..
ఇక వేణు మాధవ్ అకాల మరణం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ కోలుకుంటారు అనుకున్నానని, నటుడిగా ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన మరణించడం బాధాకరమని, గోకులంలో సీత నుంచి నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారని, హాస్యం పండించడంలో మంచి టైమింగ్ ఉన్న నటుడు వేణుమాధవ్ అని వప్ గుర్తు చేసారు. మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్లో అందరినీ సరదాగా ఉంచేవారని, వర్తమాన రాజకీయ విషయాలపై ఆసక్తి చూపేవారని పవన్ పేర్కొన్నారు. వేణుమాధవ్ మృతికి తన తరఫున, జనసైనికుల తరఫునా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని అన్నారు. వేణు మాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Recommended Video
మంచి హాస్యనటుడిని పరిశ్రమ కోల్పోయింది.. దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ప్రముఖులు..
ఇక వేణు మాధవ్ మృతి పై రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మంచి కమెడియన్ ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేసారు రేవంత్ రెడ్డి. వేణుమాధవ్ తెలుగు ప్రజలు గర్వించదగ్గ హాస్య నటులని, ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియచేస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని అదేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలియజేసారు.
నారా లోకేష్ విచారం.. టీడిపితో వేణుమాధవ్ కు సుధీర్గ అనుభవం ఉందన్న యువనేత..
ప్రముఖ సినీ హాస్యనటుడు వేణుమాధవ్ మృతి పట్ల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం తెలిపారు . హాస్యనటులు, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషి వేణుమాధవ్ మరణం విచారకరమని, స్వర్గీయ ఎన్టీఆర్ హయాం నుంచి నేటి వరకు పార్టీకి వేణుమాధవ్ చేసిన సేవలు వెలకట్టలేనివని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని లోకేష్ తెలిపారు.
తెలంగాణ టీడిపి నేతల విచారం.. వేణుమాధవ్ జ్ఞాపకాలను నెమరువేసుకున్న నేతలు..
అంతే కాకుండా వేణు మాధవ్ ఆకస్మిక మృతి పట్ల టీడీపీ తెలంగాణ అధ్యక్షులు ఎల్. రమణ, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బక్కని నర్సింహులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు అరవింద్ కుమార్ గౌడ్, కొత్తకోట దయాకర్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. తొలి నుంచి టీడీపీ తో వేణు మాధవ్ కు అనుబంధం ఉందన్నారు. అయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.