కేసీఆర్ గారూ! టీఎస్ఆర్టీసీ సమ్మెపై ఆర్ నారాయణమూర్తి భావోద్వేగం
హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. సమ్మె కారణంగా ప్రభుత్వం, ఆర్టీసీ సంఘాల మధ్యలో సామాన్యులు, ప్రజలు నలిగిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుద్ధాల హనుమంతు, జానకమ్మ అవార్డు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఆ ఒక్కటీ తప్ప! ప్రభుత్వంతో చర్చలకు రండి: ఆర్టీసీ సంఘాలకు కేకే పిలుపు, అశ్వద్ధామరెడ్డి ఏమన్నారంటే?
సమస్యను పరిష్కరించాలి..
ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్ నారాయణ మూర్తి అన్నారు. ప్రభుత్వం కార్మిక సంఘాలను దూరం పెట్టడం సరికాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక సంఘాలతో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని సూచించారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..
ఇప్పటికే విద్యా, వైద్యం, విమానయానం, రైల్వే, ఆర్టీసీలు ప్రైవేటీకరణ జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ కలిసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆర్ నారాయణ మూర్తి కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి, చర్చించి ఆర్టీసీ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని సూచించారు.
పదిరోజులుగా సమ్మె..
ప్రభుత్వాలు నంది అవార్డులను ప్రకటించి మర్చిపోయాయని, కానీ, సుద్ధాల అశోక్ తేజ తన సొంత ఖర్చులతో నటీనటులకు, కళకారులకు అవార్డులను ఇచ్చి ప్రోత్సహించడం అభినందనీయమని ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. కాగా, తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు గత పదిరోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మె కారణంగా ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రైవేటు వ్యక్తులతో బస్సులు నడిపినప్పటికీ..
ప్రైవేటు వ్యక్తులతో ప్రభుత్వం బస్సులను నడిపించినప్పటికీ పూర్తిస్థాయిలో ప్రయాణికులకు సేవలు అందించడం సాధ్యం కావడం లేదు. ఉద్యోగాల నుంచి తీసేస్తున్నామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనతో పలువురు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే తెలంగాణలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ ఉద్యోగాలు పోతున్నాయనే బాధతో ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి అనే డ్రైవర్ పెట్రోల్ సోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లోని కార్వాన్లో ఆర్టీసీ కండక్టర్ సురేందర్ గౌడ్ ఇంట్లో ఉరివేసుకుిన ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం హెచ్సీయూ డిపో ఎదుట ఆర్టీసీ బస్ కండక్టర్ సందీప్ బ్లేడుతో కోసుకున్నారు. గమనించిన తోటి కార్మికులు వెంటనే అతడ్ని కొండాపూర్లోని ఆస్పత్రికి తరలించారు. సందీప్ పరిస్థితి కాస్త విషమంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని మేధావులు, సామాజికవేత్తలు చెబుతున్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.