తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ అద్భుతంగా సాగుతోంది: వ్యాక్సిన్లు గర్వకారణమంటూ బాలకృష్ణ
హైదరాబాద్: మనదేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విదేశాల్లోని ప్రజలకు కూడా ఉపయోగపడటం గర్వకారణమని ప్రముఖ సినీటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ అద్భుతంగా సాగుతోందన్నారు.
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి పాటు పడాలని ప్రజలను కోరారు.
కరోనా విపత్కాలంలోనూ వైద్యులు అంకిత భావంతో నాణ్యమైన సేవలు అందించారని కొనియాడారు. కరోనాతో పోరాడి మృతి చెందినవారికి బాలకృష్ణ నివాళులర్పించారు. సేవాభావంతోనే ఎన్టీఆర్ క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నిరుపేదలకు సేలందిస్తోందన్నారు. వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ జనవరి 16 నుంచి పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆరోగ్యసిబ్బందికి, ఫ్రంట్లైన్ వర్కర్లకు తొలి దశలో వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు కూడా వ్యాక్సిన్ తీసుకోనున్నారు.
ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8,87,066 కరోనా పాజిటివ్ కేసులుండగా, 7149 మంది మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,78,528 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1389 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఫోటోలు: నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో 72వ గణతంత్ర వేడుకలు: హాజరైన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 2,93,590కి చేరాయి. కరోనా బారినపడి 1592 మంది ఇప్పటి వరకు మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో 2,88,926 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3072 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా, 189కి కరోనా సోకగా, 349 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇద్దరు మరణించారు.