జీఎస్టీ ఎఫెక్ట్: సినిమా టికెట్ల ధరల పెంపునకు బ్రేక్
ఇటీవల పెంచిన సినిమా టికెట్ల ధరలను తెలంగాణ ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఇందుకు సంబంధించి వారం రోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వులు ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.
హైదరాబాద్: ఇటీవల పెంచిన సినిమా టికెట్ల ధరలను తెలంగాణ ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఇందుకు సంబంధించి వారం రోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వులు ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేదీ నేతృత్వంలోని కమిటీ సినిమా థియేటర్లలో టికెట్ల ధర పెంపునకు సంబంధించి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ధర పెంచుతూ హోంశాఖ వారం రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, జులై 1 నుంచి వస్తు సేవల పన్ను(జీఎస్టీ ) అమలవుతుండటంతో పాటు సినిమా పరిశ్రమ నుంచి వస్తున్న ఒత్తిడి, ఇతర అంశాల దృష్ట్యా ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని కేటగిరీ థియేటర్లలో పెంచిన ధరలు కూడా ఇందుకు ఓ కారణమని తెలుస్తోంది.
తాజా నిర్ణయంతో టికెట్ల ధరలను పెంచుతూ జూన్ 23న జారీ చేసిన జీవో నెం. 75 అమలు నిలిచిపోయింది. ఉత్తర్వులను నిలుపుదల చేసి సంబంధిత దస్త్రాన్ని ముఖ్యమంత్రి పరిశీలనకు పంపాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించినట్లు సమాచారం.