Hyderabad: ఉర్దూ వర్శిటీలో మంటలు: రాత్రంతా రోడ్డు మీదే..సెమిస్టర్ బాయ్ కాట్: హెచ్ సీయు మద్దతు
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశ రాజధానిలో జామియా మిల్లియ ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనల ప్రభావం.. హైదరాబాద్ పైనా పడింది. జామియా విశ్వవిద్యాలయం విద్యార్థుల తరహాలోనే హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనిర్శిటీ విద్యార్థులు ఆందోళనలకు దిగారు. నిరసన ప్రదర్శనలకు తెర తీశారు.రాత్రంతా రోడ్ల మీదే బైఠాయించారు. సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించారు.
ఢిల్లీ పోలీసుల మెడకు: జామియా వర్శిటీ విద్యార్థినులను లైంగికంగా: ప్రైవసీకి దెబ్బ: వైస్ ఛాన్సలర్ ఫైర్.
పోలీసుల అప్రమత్తం..
వారి ఆందోళనకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్ సీయు) విద్యార్థులు మద్దతు ఇచ్చారు. దీనితో గచ్చీబౌలిక పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచార అందుకున్న వెంటనే సైబరాబాద్ పోలీసులు రంగప్రవేశం చేశారు. మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్శిటీ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపజేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
జామియా వర్శిటీ విద్యార్థుల నిర్బంధానికి నిరసనగా..
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడంతో పాటు ఇదే ఉద్యమంలో పాల్గొంటోన్న జామియా మిల్లియా ఇస్లామియా విద్యార్థులను ఢిల్లీ పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ మౌలానా ఆజాద్ ఉర్దూ వర్శిటీ విద్యార్థులు ఈ ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. జామియా యూనివర్శిటీ క్యాంపస్ లోకి ప్రవేశించిన పోలీసులు.. విద్యార్థుల హాస్టళ్లలోకి దూరి మరీ వారిపై లాఠీ ఛార్జీ చేయడం, అక్రమంగా పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రాత్రంతా బైఠాయింపు...
మౌలానా ఆజాద్ వర్శిటీ విద్యార్థులు ఆదివారం రాత్రంతా ప్రధాన ద్వారం వద్ద బైఠయించి, నినాదాలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్న జామియా విశ్వవిద్యాలయం విద్యార్థులను విడిచి పెట్టాలని గళమెత్తారు. ప్రధాన ద్వారం వద్ద టైర్లకు నిప్పు పెట్టారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వందలాదిమంది విద్యార్థులు గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సెమిస్టర్ బహిష్కరణ..
షెడ్యూల్ ప్రకారం.. సోమవారం మౌలానా ఆజాద్ వర్శిటీ విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. నిరసన ప్రదర్శనల్లో భాగంగా వారెవరూ పరీక్షలకు హాజరు కాలేదు. వాటిని బహిష్కరించారు. తరగతులకు కూడా గైర్హాజర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకూ తాము ప్రదర్శనలను కొనసాగిస్తామని హెచ్చరించారు. మౌలానా ఆజాద్ వర్శిటీ విద్యార్థుల ఆందోళనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు మద్దతు ఇచ్చారు. తరగతులను బహిష్కరించారు.