రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం..
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఐదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అవతరణోత్సవాలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని సెంట్రల్ లాన్స్ వద్ద ఉదయం 9గంటలకు జాతీయ జెండా ఎగరవేయనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు, పాఠశాలల విద్యార్థులు పాల్గొననున్నారు. ఇక జిల్లాల్లో స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి డిప్యూటీ ఛైర్మన్, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, విప్లు, జెడ్పీ చైర్పర్సన్లు జాతీయ జెండా ఎగురవేస్తారు.
ఉద్యోగుల డీఏ పెంచిన తెలంగాణ సర్కార్, ప్రజలకు కేసీఆర్ ఆవిర్భావ శుభాకాంక్షలు
తొలిసారి జూబ్లీహాలులో
రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా తొలిసారి చారిత్రక ప్రదేశంలో అవతరణోత్సవాల నిర్వాహణకు ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు ఈ ఉత్సవాలు పరేడ్ గ్రౌండ్స్లో జరిగేవి. అయితే ఎన్నికల నియమావళి, ఎండల తీవ్రత దృష్ట్యా వేడుకలకు జూబ్లీహాలును ఎంపిక చేశారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ఆవిర్భావ వేడుకలు ఇక్కడే జరిగాయి.
అభివృద్ధి ప్రతిబింబించేలా
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, అభివృద్ధిని ప్రతిబింబించేలా జూబ్లీహాలులో అవతరణ వేడుకలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు అక్కడ ఏర్పాట్లు చేశారు. దాదాపు రెండు వేల మంది కూర్చునేలా సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. ఉత్సవాల అనంతంరం అతిథులు, ఆహ్వానితులకు తేనీటి విందు ఇవ్వనున్నారు.
పలుచోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణ అవతరణ దినోత్సవాన్నిపురస్కరించుకుని జూబ్లీహాల్లో ఉదయం 11.30గంటల నుంచి ఒంటి గంట వరకు కవి సమ్మేళనం, మధ్యాహ్నం 3 నుంచి 5గంటల వరకు వీఐపీలకు ఒగ్గుడోలు కళాకారులతో ప్రత్యేక స్వాగత కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన జరగనుంది. మరోవైపు సాయంత్రం రవీంద్రభారతిలో పోలీసు పతకాల ప్రదానం జరగనుంది. దీంతో పాటు కళాభవన్లోనూ కవి సమ్మేళనం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 3వ తేదీన రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు, 4న ఫిల్మోత్సవ్ నిర్వహించనున్నారు.
అందంగా ముస్తాబైన రాజధాని
అవతరణ వేడుకల కోసం హైదరాబాద్ను ఆకట్టుకునేలా ముస్తాబు చేశారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించింది. ప్రధాన కూడళ్లు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు రంగురంగుల లైట్ల వెలుగులో కొత్త కళ సంతరించుకున్నాయి.