బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ ఇండియా .. షేక్ చేస్తున్న వెబ్ సీరీస్ ..ఆపాలని కోర్టుకెక్కిన రామలింగరాజు
హైదరాబాద్ స్థానిక సివిల్ కోర్టు నెట్ఫ్లిక్స్ తన వెబ్ సిరీస్ 'బాడ్ బాయ్ బిలియనీర్స్-ఇండియా' ప్రసారం చేయకుండా తాత్కాలిక మధ్యంతర స్టే జారీ చేసింది. సత్యం కంప్యూటర్స్ కు సంబంధించి 7వేల కోట్ల అకౌంటింగ్ కుంభకోణంలో దోషిగా తేలిన బి రామలింగరాజు ఆ వెబ్ సీరీస్ ఆపండి అంటూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది .
బ్యాడ్ బాయ్స్ బిలియనీర్స్ సీరిస్ లో తన బయోపిక్ అంటూ రామలింగరాజు అభ్యంతరం
బుధవారం భారతదేశంలో విడుదల కానున్న వెబ్ సిరీస్ను నెట్ఫ్లిక్స్ పరిశోధనాత్మక కథనాలుగా ప్రచారం చేసింది. భారతదేశంలో అత్యంత అపఖ్యాతి పాలైన వ్యాపారవేత్తలు, వైట్ కాలర్ నేరస్తులైన వారిపై తీసిన వెబ్ సీరీస్ గా ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ ను బట్టి అర్ధం అవుతుంది. ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ గా స్క్రీన్ మీదకు నేటి నుండి రానున్న బ్యాడ్ బాయ్స్ బిలియనీర్స్ సీరిస్ సత్యం కుంభకోణం నేపథ్యంలోనే తనపై తీశారనే అనుమానం ఉందని తనకు ఉన్న గోప్యత హక్కులను ఈ సీరీస్ ఉల్లంఘిస్తుందని రామలింగ రాజు ఆరోపించారు.
వెబ్ సీరీస్ ఆపాలని కోర్టుకు ... వరుస పిటీషన్లు ... తాజాగా రామలింగరాజు విజ్ఞప్తి
ఇవాళ రామలింగరాజు కోర్టుకు వెళ్లి తనపై ఉన్న కేసు విచారణ ఇంకా కొనసాగుతున్న కారణంగా తనను నేరస్తుడిగా చూపించే ప్రయత్నంలో భాగంగా వస్తున్న వెబ్ సీరీస్ ఆపాలని కోర్టును కోరారు. ట్రెయిలర్ను బట్టే తన పరువుకు నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా, బీహార్ దిగువ కోర్టు ఉత్తర్వుపై నెట్ఫ్లిక్స్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. బీహార్ దిగువ కోర్టు నెట్ ఫ్లిక్స్ రాబోయే వెబ్ సిరీస్లో వ్యాపారవేత్త సుబ్రతా రాయ్ పేరును ఉపయోగించకుండా నిరోధించింది. ఇంకోపక్క బాడ్ బాయ్ బిలియనీర్స్ ప్రీ స్క్రీనింగ్ నిర్వహించాలని దాదాపు 2 బిలియన్ డాలర్ల పిఎన్బి కుంభకోణంలో నిందితుడైన మెహుల్ చోక్సీ వేసిన పిటిషన్ను ఆగస్టు 28న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
వైట్ కాలర్ నేరస్తులపై తీసిన పరిశోధనాత్మక కథనాలుగా బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ ఇండియా
బ్యాంకులను, జనాన్ని మోసగించి విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా , సహారా సుబ్రతా రాయ్ పీఎన్ బీ స్కాం లో నిందితులైన నీరవ్ మోదీ , మెహుల్ చోక్సీ, సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో సత్యం రామలింగ రాజులను ఉద్దేశించి తీసిందని అర్ధమవుతుంది. ఇప్పటికే ఈ సీరీస్ ట్రైలర్ కు బాగా క్రేజ్ వచ్చింది . ఇక నేటి నుండి ప్రసారానికి రంగం కూడా సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో సత్యం రామలింగరాజు ఈ సీరిస్ పై కోర్టుకు వెళ్ళగా ప్రసారం నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఏడేళ్ళ జైలు శిక్ష .. మళ్ళీ అప్పీలుతో కొనసాగుతున్న విచారణ
2009లో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 2015 లో, ఇక్కడ ఉన్న అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు (ఎసిఎంఎం) సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి రామలింగరాజు మరియు మరో 9 మందికి 7 వేల కోట్ల రూపాయల అకౌంటింగ్ మోసంలో ఏడు సంవత్సరాల కఠినమైన జైలు శిక్షను విధించింది . మే 2015లో, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు రామలింగరాజు మరియు మరో తొమ్మిది మందికి బెయిల్ మంజూరు చేసింది . తిరిగి తమ కేసును విచారించాలని అప్పీలు దాఖలు చేసిన నేపధ్యంలో వారికి విధించిన ఏడు సంవత్సరాల కఠినమైన జైలు శిక్షను నిలిపివేసింది. తిరిగి కేసును విచారిస్తుంది . తాజాగా ఈ వెబ్ సీరీస్ తో సత్యం రామలింగరాజు పేరు వార్తల్లో నిలిచింది .