ఒకరికి తెలియకుండా మరొకరితో: సి.ఇంజనీర్ అరెస్ట్
హైదరాబాద్: ఇద్దరు మహిళలను ప్రేమించి ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్న వ్యక్తిని హయత్ నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా బీబీ నగర్ మండలం కొండమడుగుకు చెందిన నరేష్ సివిల్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు.
అతను ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన స్వర్ణరేఖను ప్రేమించి 2011లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. ఏడాది కాకముందే నరేష్ స్నేహితుడి ద్వారా హయత్ నగర్కు చెందిన కళ్యాణి పరిచయం అయింది.
ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ సమయంలో తనకు వివాహం అయినట్లు నరేష్ చెప్పలేదు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల వారికి కోల్కతాలో ఉద్యోగం వచ్చింది. ఇద్దరు అక్కడకి వెళ్లిపోయారు.
ఇదిలా ఉండగా, తనను అధికారికంగా పెళ్లి చేసుకోవాలని రిజిస్టర్ పెళ్లి చేసుకున్న స్వర్ణరేఖ ఒత్తిడి తెచ్చింది. దీంతో అతను ఈ నెల 3వ తేదీన ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు. మే 1న హైదరాబాద్ వచ్చాడు. ఈ క్రమంలో నరేష్ విషయం ఇంట్లో తెలిసింది. వారు కళ్యాణి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అదే రోజున పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు.