Yadadri Temple నిర్మాణం అద్భుతం... ఆలయంలో అడుగుపెట్టగానే పరవశించిపోయాను : సీజేఐ రమణ
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కొనియాడారు.ప్రపంచమే ఆశ్చర్యపోయేలా యాదాద్రి రూపుదిద్దుకుంటోందని అన్నారు. ఆలయంలో అడుగుపెట్టగానే పరవశించిపోయానని చెప్పారు. ఆలయం చుట్టూ పార్కులను కూడా అభివృద్ది చేస్తూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణం జరుగుతోందని... యాదాద్రి ఆలయం తెలంగాణకే గర్వ కారణమని అన్నారు.
యాదాద్రి ఆలయ ప్రారంభం కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సీజేఐ రమణ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఆరేళ్లలో అనేక పర్యాయాలు అక్కడ పర్యటించి చకచకా ఆలయ నిర్మాణం పూర్తయ్యేలా కృషి చేశారని పేర్కొన్నారు. జనవరి,ఫిబ్రవరిలో మహాసుదర్శన యాగం జరిపాక ఆలయ ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు.
మహాసుదర్శన యాగం కోసం 3 వేల మంది రుత్వికులను ఆహ్వానించినట్లు తెలిసిందని... రాష్ట్రపతితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించే యోచనలో ఉన్నారని తెలిపారు. కరోనా కారణంగా ఆలయం ప్రారంభం కాలేదని... ఇప్పుడు కేసులు తగ్గిన నేపథ్యంలో సంక్రాంతి తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.
ఆలయంలో మొత్తం 8 మండప ప్రాకారాలు ఉన్నాయని... అంతటా కాకతీయ కళాతోరణాలు,అష్టలక్ష్మీ రూపాలతో సాలహారాలు,అళ్వారుల విగ్రహాలు,ప్రహ్లాద చరితం,దేవతామూర్తుల విగ్రహాలు అద్భుతంగా ఏర్పాటు చేశారని సీజేఐ కొనియాడారు.
మంగళవారం(జూన్ 15) ఉదయం 8.30గంటలకు సీజేఐ ఎన్వీ రమణ దంపతులు హైదరాబాద్ నుంచి యాదాద్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి,జగదీశ్ రెడ్డి,ప్రభుత్వ విప్ గొంగిడి సునీత సీజేఐ దంపతులకు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతించారు.అనంతరం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని... ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీజేఐ దంపతులు వీవీఐపీల కోసం నూతనంగా నిర్మించిన అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ అల్పాహారం అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వైటీడీఏ అధికారులు అక్కడ చేపడుతున్న పనుల గురించి సీజేఐకి వివరించారు.