ఆఖరి ప్రత్యామ్నాయంగా కోర్టులు-మధ్యవర్తిత్వమే మందు-సీజేఐ రమణ కీలక వ్యాఖ్యలు
భారత్ లో మధ్యవర్తిత్వానికి ఆదరణ పెంచేందుకు ప్రయత్నిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ఇవాళ మరోసారి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన రమణ... న్యాయం కోరుకునే వారికి కోర్టులు అంతిమ ప్రత్యామ్నాయం కావాలని సూచించారు.
కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతుందని చెప్పారు.
విస్తృత సంప్రదింపులతో ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ సన్నాహక సదస్సుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోర్టులకు వచ్చేముందే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చన్నారు.
మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో పరిష్కారాలు లభిస్తాయని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. పెండింగ్ కేసుల సత్వర విచారణ జరగాలన్నారు.
మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందని రమణ గుర్తుచేశాు. సంప్రదింపుల ద్వారా సమస్యలు కొలిక్కి తేవచ్చని వెల్లడించారు. ఆస్తుల పంపకాలను కుటుంబ సభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. సాధ్యమైనంతవరకు మహిళలు మధ్యవర్తిత్వంలో వివాదాలు పరిష్కరించుకోవాన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ సరైన వేదిక అని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఇదే కోవలో న్యాయరంగంలోనూ సంస్కరణలు అవసరం అన్నారు.