Must Read:తెలంగాణలో మరో వైరస్:కరోనా జాతిదే..సైంటిస్టులు చెబుతున్నదేమిటి..?
హైదరాబాదు: భారత్లో తొలి కరోనావైరస్ కేసు కేరళలో జనవరి 30న బయటపడింది..? కానీ అంతకుముందే భారత్లోకి ఈ మహమ్మారి ప్రవేశించిందా..? అంటే గతేడాది నవంబర్-డిసెంబర్ నెలల మధ్యే కోవిడ్-19 భారత్లోకి ప్రవేశించిందా అంటే శాస్త్రవేత్తల నుంచి ఔననే సమాధానం వినిపిస్తోంది. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు పలు ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టారు.
భారత్లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..
కరోనా జాతికి చెందిన కొత్త వైరస్
దేశంలోనే ప్రముఖ పరిశోధనా కేంద్రాల్లో పనిచేస్తున్న టాప్ సైంటిస్టులు కరోనావైరస్పై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చైనాలోని వూహాన్ నగరం కరోనావైరస్కు కేంద్రబిందువుగా ఉన్నప్పటికీ ఆ కరోనావైరస్కు సంబంధించిన అవే మూలాలు కలిగి ఉన్న మరో వైరస్ నవంబర్- డిసెంబర్ నెలల మధ్య భారత్లో ప్రవేశించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా జాతికి చెందిన ఈ వైరస్ ప్రస్తుతం తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో స్వైరవిహారం చేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది గతేడాది నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీల మధ్య ప్రవేశించిందని చెప్పారు. చైనా నుంచి భారత్కు వచ్చిన ప్రయాణికులు ద్వారా కరోనావైరస్ భారత్కు ప్రవేశించిందని అనుకుంటున్నాం కానీ అంతకుముందే భారత్కు వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జనవరి 30కి ముందు భారీ ఎత్తున కరోనావైరస్ పరీక్షలు చైనా నిర్వహించలేదని వారు గుర్తుచేస్తున్నారు.
క్లాడ్ I/A3i అని నామకరణం
హైదరాబాదులోని ప్రముఖ పరిశోధనా కేంద్రం సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలెక్యురల్ బయాలజీ (సీసీఎంబీ) సంస్థకు చెందిన పరిశోధకులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కరోనావైరస్ జాతికి చెందిన ఈ వైరస్ ఎప్పుడు పుట్టుకొచ్చిందో కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు ఇదే వైరస్కు చెందిన కొత్త రకం వైరస్ను కూడా వీరు కనుగొనడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న వైరస్ల కంటే కొత్త వైరస్లో చాలా తేడాలున్నాయని చెబుతున్నారు. ఈ కొత్త వైరస్కు వారు క్లాడ్ I/A3i అని నామకరణం చేశారు. కేరళలో బయటపడ్డ తొలి కరోనావైరస్ కేసు వూహాన్ నగరంతో సంబంధం ఉంది కానీ హైదరాబాదులో కనుగొన్న వైరస్ కేసు క్లాడ్ I/A3iగా గుర్తించినట్లు చెప్పారు. అయితే ఇది చైనా నుంచి వచ్చినది కాదని ఆగ్నేసియా ప్రాంతం నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతంలోని ఏ దేశం నుంచి వచ్చిందో అనేదానిపై మాత్రం కచ్చితంగా చెప్పలేకున్నామని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు.
కేరళలో తొలికేసు కంటే ముందు తెలంగాణలోనే..
ఇక కొత్త వైరస్ క్లాడ్ I/A3i తెలంగాణలో జనవరి 17 నుంచి ఫిబ్రవరి 25 మధ్య వచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే జాతికి చెందిన మరొక వైరస్ ఏ2ఏ గతేడాది డిసెంబర్ 13 నుంచి ఈ ఏడాది జనవరి 22 మధ్య గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఇక ఈ తరహా వైరస్లు ప్రపంచంలో ఇంతకుముందు ఎప్పుడూ లేవని ఢిల్లీలోని మరో పరిశోధనా కేంద్రం సీఎస్ఐఆర్-ఐజీఐబీకి చెందిన సైంటిస్టులు చెబుతున్నారు. అంతకుముందు కనుగొన్న 10 వైరస్లకు క్లాడ్ I/A3iకి చాలా తేడా ఉందని చెప్పారు. భారత్లో ఒకే సోర్స్ నుంచి ఈ వైరస్ పుట్టుకొచ్చి ఒకేసారి దేశవ్యాప్తంగా విజృంభించిందని శాస్త్రవేత్తలు చెప్పారు.
పలు రాష్ట్రాల్లో క్లాడ్ I/A3i వైరస్ అందుకే అధిక కేసులు
ఇక పరిశోధనల్లో భాగంగా ఈ వైరస్ జన్యువును క్రమంగా 64 జన్యువుల కింద చేసి పరీక్షించడం జరిగిందని చెప్పారు. అయితే మొత్తం జన్యువుల్లో 41శాతం క్లాడ్ I/A3i ఉన్నట్లుగా తాము గుర్తించినట్లు డాక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు. ఇవన్నీ వివిధ రాష్ట్రాలకు పాకాయని చెప్పారు. అయితే మొత్తం 16 నుంచి 19 రాష్ట్రాల్లో ఈ జన్యువుకు సంబంధించిన మూలాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఎక్కువగా ఈ తరహా వైరస్ ఉందని చెబుతున్నారు. అయితే కరోనావైరస్ పక్కన ఉంచితే మొత్తంగా వస్తున్న కేసుల్లో ఈ క్లాడ్ I/A3i వైరస్ కూడా ఉందని స్పష్టమవుతోంది.