టీఆర్ఎస్ ఎమ్మెల్యే,మంత్రి మధ్య వాగ్వాదం.. ఎందుకు..?
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్,ఎమ్మెల్యే శంకర్ నాయక్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యేను అయిన తాను రాకుండానే సమావేశం ఎలా నిర్వహిస్తారని శంకర్ నాయక్ కలెక్టర్ను ప్రశ్నించారు. తాను ఆర్ఈసీలో చదువుకున్నానని.. ఎర్రబస్సు ఎక్కి రాలేదని వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే వాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
సమీక్ష సమావేశాలు కేవలం ఫోటోలకే పరిమితమవుతున్నాయని కూడా శంకర్ నాయక్ మండిపడ్డారు. స్థానిక సమస్యలు ఎమ్మెల్యేలకు తెలుస్తాయని.. మంత్రి,కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. అలాంటిది స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తాను రాకముందే సమీక్ష సమావేశం ఎలా ప్రారంభించారని ప్రశ్నించారు. అయితే జిల్లా కలెక్టర్ శంకర్ నాయక్కి నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. సమాచారం లోపం వల్లే ఇలా జరిగిందని.. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
కాగా,గతంలో వివాదాస్పద వ్యాఖ్యలతో శంకర్ నాయక్ వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. రెడ్డి,వెలమ సామాజికవర్గాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు గతంలో వివాదాస్పదమయ్యాయి. అంతకుముందు కలెక్టర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కారు. తాజాగా మంత్రితో వివాదం టీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారింది.