కుంతియా 'చిచ్చు': కోమటిరెడ్డి సోదరుల ఆగ్రహం, ఉత్తమ్తో విబేధాలు, పార్టీలోనే ఉంటారా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కుంతియా మాటలను నమ్మేందుకు ఎవరూ కూడ సిద్దంగా లేరని నల్లొండ ఎమ్మెల్యే, సిఎల్పీ ఉప నాయకుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు.
నల్లగొండ: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కుంతియా మాటలను నమ్మేందుకు ఎవరూ కూడ సిద్దంగా లేరని నల్లొండ ఎమ్మెల్యే, సిఎల్పీ ఉప నాయకుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానని వెంకట్రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి సోదరులు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో కుంతియా చేసిన ప్రకటనతో కుంతియాపై వారు ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాలుగు రోజుల క్రితం హైద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నేతలతో కుంతియా సమావేశం నిర్వహించారు.
పార్టీ అనుబంధ విభాగాలతో పాటు పార్టీ సీనియర్లు, ప్రజాప్రతినిధులతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. 2019 ఎన్నికల వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడుగా ఉత్తమ్కుమార్రెడ్డి కొనసాగుతారని ప్రకటించారు.
కుంతియా ప్రకటన కోమటిరెడ్డి సోదరుల్లో ఆగ్రహం తెప్పించింది. కుంతియా ప్రకటనపై విరుచుకుపడ్డారు. పిసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న కోమటిరెడ్డి సోదరులు ఈ అంశంపై తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.
కుంతియాపై కోమటిరెడ్డి సోదరుల ఆగ్రహం
2019 ఎన్నికల వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో ఉత్తమ్కుమార్రెడ్డి ఉంటారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా చేసిన ప్రకటనపై సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంతియా మాటలతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవిని యువకులకు ఇవ్వాలని రాహుల్గాంధీని కోరుతామన్నారు. 2019 వరకు ఉత్తమ్కుమార్రెడ్డే పీసీసీ చీఫ్గా ఉంటారని కుంతియా చేసిన ప్రకటన వెనుక కుట్ర దాగి ఉందని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆరోపించారు.
Recommended Video
పీసీసీ చీప్ పదవిపై కోమటిరెడ్డి సోదరుల ఆశలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాలని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్రెడ్డి ఆశతో ఉన్నారు. తమ ఇద్దరిలో ఎవరికి పిసీసీ పగ్గాలను ఇచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని కోమటిరెడ్డి సోదరులు చెబుతున్నారు. ఈ విషయమై కోమటిరెడ్డి సోదరులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో చర్చించినట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. కానీ, ఉత్తమ్ను వచ్చే ఎన్నికల వరకు మార్చే ప్రసక్తేలేదని కుంతియా ప్రకటనతో కోమటిరెడ్డి సోదరులకు నిరాశే ఎదురైంది.దీంతో పార్టీ నాయకత్వంతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్దమయ్యారు.
ఉత్తమ్తో విబేధాలే కారణమా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డితో కోమటిరెడ్డి సోదరులకు విబేధాలున్నాయి. నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో కోమటిరెడ్డి సోదరులకు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఓడించేందుకు ఉత్తమ్ ప్రయత్నించారని కోమటిరెడ్డి సోదరులు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిపై కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విజయం సాధించారు. ఉత్తమ్ను ఆ పదవి నుండి తప్పించి తాము ఈ పదవిని దక్కించుకోవాలని కోమటిరెడ్డి సోదరులు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సమయంలోనే కుంతియా చేసిన ప్రకటనతో కోమటిరెడ్డి సోదరులకు నిరాశ కల్గింది.
ముఖ్యమంత్రి అవుతాను
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానని సిఎల్పీ ఉప నాయకుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యేది ఖాయమన్నారు. అయితే ఎప్పడు ముఖ్యమంత్రి అవుతాననే విషయమై స్పస్టత లేదన్నారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. పిసీసీ చీఫ్ పదవి విషయంలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని కలవనున్నట్టు చెప్పారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.ఇదిలా ఉంటే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని కుంతియా ప్రకటించిన మూడు రోజులకే కోమటిరెడ్డి సోదరులు ఏకంగా కుంతియాను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
పార్టీ మారుతారా?
కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరుతారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. కానీ, ఈ ప్రచారాన్ని కోమటిరెడ్డి సోదరులు ఖండిస్తున్నారు.తెలంగాణకు చెందిన కొందరు కీలకమైన కాంగ్రెస్ పార్టీ నేతలతో బిజెపి జాతీయ నాయకత్వం చర్చలు జరుపుతోంది. బిజెపిలో చేరితే బంపర్ ఆఫర్లు ఇస్తామని బిజెపి నాయకత్వం హమీ ఇస్తోంది.ఈ తరుణంలో కోమటిరెడ్డి సోదరులతో కూడ బిజెపి నేతలు చర్చించారనే ప్రచారం కూడ బిజెపి వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే ఈ ప్రచారాన్ని కోమటిరెడ్డి సోదరులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. గతంలో కూడ టిఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం కూడ జరిగిందనే విషయాలను వారు సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నట్టు సమాచారం.పిసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి సోదరులు ఆశతో ఉన్నారు. పిసీసీ చీఫ్ పదవిని కట్టబెడితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి హమీ ఇస్తున్నారు. అయితే పార్టీ నాయకత్వం ఈ విషయమై స్పష్టత ఇవ్వలేదు.రాహూల్ను కలిసిన తర్వాత కోమటిరెడ్డి సోదరులు ఈ విషయమై స్పష్టత ఇచ్చే అవకాశం లేకపోలేదని ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. పిసీసీ చీఫ్ పదవి దక్కకపోతే పార్టీలోనే ఉంటారా, లేదా అనే చర్చ కూడ సాగుతోంది. ఈ తరుణంలోనే కుంతియాపై కోమటిరెడ్డి సోదరులు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.