బడ్జెట్ అంకెల గారడే ... కేసీఆర్ పద్దుపై విక్రమార్క విసుర్లు
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బడ్జెట్ అంకెల గారడీ అని విమర్శించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అప్పులను కూడా ఆదాయంగా చూపించి మభ్యపెట్టారని మండిపడ్డారు. మళ్లీ అప్పులు తీసుకొచ్చి ప్రజలపై భారం మోపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు.
నిరుద్యోగ యువతకు మొండిచేయి ..?
నిరుద్యోగ యువతకు సీఎం కేసీఆర్ హ్యాండిచ్చారని ఫైరయ్యారు భట్టి విక్రమార్క. బడ్జెట్ లో కేటాయించిన రూ.1,810 కోట్లు ఎలా ఇస్తారో చెప్పలేదన్నారు. ఇప్పటివరకు నిరుద్యోగ యువతకు సంబంధించి జాబితా లేదని .. అలాంటప్పుడు భృతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పెంచిన ఆసరా పింఛన్లు, రైతుబంధు నగదు ఎప్పటినుంచి ఇస్తారో చెప్పలేదని .. దీంతో ఈ బడ్జెట్ లో ఇస్తారా లేదోనన్న అనుమానాలు నెలకొన్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
కేటాయింపులే ఘనం ..
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే 4 నెలల కాలానికి ప్రవేశపెట్టే బడ్జెట్ .. అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పడినందున పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే పథకాలకు నిధుల కేటాయింపు సరై సమయంలో జరిగేదని అభిప్రాయపడ్డారు. ఏడాదిపాటు పాలన లేకుండా చేసేందుకే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరోపించారు. ఈ తాత్కాలిక బడ్జెట్ తో ప్రజలకు ఓరిగేదేమీ ఉండదన్నారు. ఈ నాలుగు నెలలు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కావని .. తర్వాత ప్రవేశపెట్టే బడ్జెట్ తో మరో ఆరునెలలు పాలన స్తంభించిపోతుందన్నారు.
నిరంకుశ పాలన ...
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని విమర్శించారు భట్టి విక్రమార్క. ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు నెలల వరకు క్యాబినెట్ లేకపోవడం ఏ రాష్ట్ర చరిత్రలో లేదన్నారు. రాష్ట్రంలో విధిగా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన సమయం రావడంతో .. అప్పటికప్పుడు ముహూర్తం చూసుకొని మరీ మంత్రివర్గ కూర్పు చేశారని విమర్శించారు.
ఎమ్మెల్సీ బరిలో ఉంటాం ..
కాంగ్రెస్ పార్టీకి తగిన సంఖ్యాబలం ఉన్నదని .. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలుస్తామని స్పష్టంచేశారు భట్టి విక్రమార్క. టీఆర్ఎస్ పార్టీ ఐదుగురు అభ్యర్థులను ఎలా ప్రవేశపెడుతుందని ప్రశ్నించారు. తగిన సంఖ్యాబలం లేదని తెలిసి కూడా అలా ఎలా క్యాండెట్లను ప్రకటిస్తారని మండిపడ్డారు. దీంతో ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దొడ్డిదారిన గెలువాలని చూస్తోందని అర్థమవుతోందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని విమర్శించారు.