కరోనా నుండి కోలుకున్న సీఎల్పీ నేత భట్టి.!తనకు కరోనా సోకలేదన్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.!
హైదరాబాద్ : కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. అందరిని పలకరిస్తూ ముందుకు వెళ్తోంది. థర్డ్ వేవ్ లో మాత్రం సినిమా సెలబ్రిటీల పైన, రాజకీయ నాయకులపైన కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పది మందితో ప్రజా సంబందాలు కలిగిఉన్న ప్రతి నేతకూ కరోనా నిర్థారణ అవుతోంది. ఈ కోవలోనే కరోనా పాజిటివ్ తో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గురువారం నెగటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వైద్యుల సూచన ప్రకారం హైదరాబాద్ లోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కరోనా నుంచి జయించినప్పటికీ నీరసంగా ఉండడంతో రెండు రోజుల పాటు ఇంట్లో ఉండి రెస్టు తీసుకుంటారు. తాను త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ఆకాంక్షించిన రాష్ట్ర ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించి కరోనాను కట్టడి చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. ఇదిలా ఉండగా తనకు కరోనా సోకలేదు బాబోయ్ అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీదర్ బాబు. పలు పత్రికలలో, టివీ లలో తనకు కరోనో పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వచ్చాయని, అది వాస్తవం కాదన్నారు శ్రీదర్ బాబు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని, కరోనా రాలేదని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని ప్రకటించారు శ్రీదర్ బాబు. సమాచార లోపంతో వచ్చిన వార్తల వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు, బంధువులు, స్నేహితులు ఆందోళన చెందుతున్నారని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను ఆరోగ్యంతో ఉన్నానని గురువారం గాంధీ భవన్ లో శ్రీధర్ బాబు ప్రకటించారు.