సీఎం కుర్చీ 50-50.. బీజేపీతోనే ప్రభుత్వం.. శివసేన ఫార్ములా.. 29 ఏళ్లకే ముఖ్యమంత్రా?
ముంబై : మహారాష్ట్రలో బీజేపీ - శివసేన కూటమి విజయం దిశగా దూసుకెళుతోంది. దాంతో బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ దక్కనుంది. అయితే ఈ క్రమంలో శివసేన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పుడు ఏర్పాటు చేయబోయేది బీజేపీ - శివసేన ప్రభుత్వమని.. సీఎం కుర్చీ చెరో సగం పంచుకుంటామని మాట్లాడుతున్న తీరు చర్చానీయాంశమైంది. ఎన్నికలకు ముందే బీజేపీ నేతలతో 50-50 ఫార్ములా గురించి మాట్లాడుకున్నామని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్రెండ్ నమోదు కానుంది. అరవై ఏళ్ల చరిత్రలో సీఎం కుర్చీని రెండు పార్టీలు పంచుకోవడం ఇదే తొలిసారి కానుంది.
బీజేపీ - శివసేన కూటమి ముందంజ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపాయి. ఆ క్రమంలో బీజేపీ - శివసేన కూటమి ఆధిక్యంలో దూసుకెళుతోంది. 2014లో శివసేనతో విభేదించిన బీజేపీ.. ఈసారి పొత్తుకు సై అంది. ఆ క్రమంలో రెండు పార్టీలు కూడా అధిక స్థానాల్లో పాగా వేయనున్నాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత కుదురుతుందా. లేదంటే విభేదాలు పొడసూపుతాయా అనేది హాట్ టాపిక్గా మారింది. అదలావుంటే ఎన్నికలకు ముందే ఈ విషయం బీజేపీ నేతలతో మాట్లాడామని.. ప్రభుత్వ ఏర్పాటులో 50-50 ఫార్ములా అమలు చేస్తామని చెబుతున్నారు శివసేన సీనియర్ లీడర్ సంజయ్ రౌత్.
ముందుంది అసలు కథ
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలపై ఈ రోజు వరకు ఆసక్తిగా ఎదురుచూసిన జనం.. ఇప్పుడు అక్కడ ఏం జరగబోతుందనే విషయంలో ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. గతంలో కంటే ఈసారి బాగా పుంజుకున్న శివసేన ఈ దఫా ఎన్నికల్లో అధిక స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. అయితే శివసేన పెద్దలు మహారాష్ట్ర సీఎం అభ్యర్థిగా ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరేను ఎన్నికలో బరిలోకి దించారు. ముంబైలోని వర్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన ఆదిత్య థాకరే గెలుపు దిశగా ఆధిక్యంలో దూసుకెళుతున్నారు.
ఆదిత్య థాకరే గెలుపు నేపథ్యంలో శివసేన నేతల సందడి
ఆదిత్య థాకరే గెలవబోతున్నారనే సంకేతాలతో ఉద్ధవ్ థాకరే నివాసానికి భారీగా చేరుకుంటున్నారు శివసేన పార్టీ నేతలు. భవిష్యత్ సీఎంగా ఆదిత్య థాకరేను చూడబోయే విషయంలో బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాల్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆదిత్య థాకరే ప్రభుత్వ అధికార పగ్గాలు చేపడితే.. అతి చిన్న వయసులో 29 ఏళ్లకే ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు.
మహా పీఠంలో చెరో సగం.. తప్పదంటున్న శివసేన
బీజేపీ - శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా విజయం సాధించనుంది. అయితే మహా పీఠం ఎవరికి దక్కనుందనే మీమాంస ఏర్పడింది. ఇంతకు సీఎం అభ్యర్థి బీజేపీ నుంచా, శివసేన నుంచా అనే సందిగ్ధం ఏర్పడింది. అదలావుంటే అధికార పీఠాన్ని చెరో సగం పంచుకోవాలన్నది శివసేన ప్లాన్. ఒకవేళ అదే జరిగితే 60 ఏళ్ల మహారాష్ట్ర ప్రభుత్వ ప్రస్థానంలో రెండు పార్టీలు సీఎం కుర్చీ దక్కించుకోవడం ఇదే మొదటిసారి కానుంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనతో విభేదాల కారణంగా ఒంటరిగానే బరిలోకి దిగింది బీజేపీ. అప్పుడు 122 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి చూస్తే వంద స్థానాల్లో మాత్రమే ఆధిక్యం కనబరుస్తోంది. అయితే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు కారణంగా ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపించినట్లైంది.
50 ఏళ్ల హిస్టరీ మహారాష్ట్రలో రిపీట్ కానుందా.. సీఎం కుర్చీ బీజేపీ నుంచి జారిపోనుందా?
పుంజుకున్న శివసేన.. ఆదిత్య థాకరేకు పట్టం కట్టాలంటూ..!
శివసేన గతంలో కంటే ఇప్పుడు బలం పుంజుకున్నట్లైంది. ఈసారి ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. ఆ క్రమంలో బీజేపీతో జతకట్టిన శివసేన సీఎం కుర్చీ చెరో సగం అనే మెలిక పెడుతోంది. ఆ విషయం ఎన్నికలకు ముందే బీజేపీ పెద్దలతో ఒప్పందం కుదిరినట్లు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఆదిత్య ఠాక్రేను సీఎం చేయాలన్నది శివసేన వ్యూహంగా కనిపిస్తోంది.
చిన్న పార్టీకి పెద్ద ఛాన్స్.. సీఎం కుర్చీ ఆఫర్ వచ్చేనా.. కాంగ్రెస్ వ్యూహం ఏంటి?
53 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా పోటీ.. 29 ఏళ్లకే సీఎంగా..!
53 ఏళ్ల కిందట థాకరే కుటుంబ నేతృత్వంలో శివసేన పార్టీ పురుడు పోసుకుంది. అయితే ఆ కుటుంబం నుంచి ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎవరూ దిగలేదు. ఈసారి తొలిసారిగా ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే ముంబైలోని వర్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆధిక్యంలో ఉన్నారు. ఆదిత్య థాకరే విజయం సాధించనున్న నేపథ్యంలో ఆయనకే సీఎం కుర్చీ ఇవ్వాలని బీజేపీ పెద్దలపై శివసేన వత్తిడి పెంచనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో ఇరు పార్టీలది 50-50 పాత్ర అని ముందుగానే చెప్పామని అంటున్నారు సంజయ్ రౌత్. ఇది కచ్చితంగా బీజేపీ - శివసేన ప్రభుత్వం అవుతుందే తప్ప దీనిపై రెండో అభిప్రాయం లేదని స్పష్టం చేశారు.