‘‘ఇదేమీ కేసీఆర్ అయ్య జాగీర్ కాదు, అడ్డగోలుగా ప్రవర్తించడానికి’’
రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్ల ఘటనపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అధికారపక్ష నేతలు అనడంపై కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్లలో పదకొండు మందిపై దాడి జరిగితే అందులో నలుగురు మాత్రమే దళితులు ఉన్నారని.. ఈ విషయాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అధికారపక్ష నేతలు అనడంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
కేసీఆర్లో భయం మొదలైంది.. అందుకే అలా..: ఉత్తమ్కుమార్ రెడ్డి ఎద్దేవా
ఈ విషయమై ఓ న్యూస్ ఛానెల్ అడిగిన ప్రశ్నకు ఉత్తమ్ సమాధానమిస్తూ, 'దళితులు కాని వాళ్లపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించవచ్చా? ముఖ్యమంత్రి చెప్పే సమాధానమిదా? ' అని ప్రశ్నించారాయన.
అంతేకాదు, అసలు, ఈ విధంగా మాట్లాడుతున్న వారికి కామన్ సెన్స్ ఉందా? ఏ కులం వారినైనా సరే, అక్రమంగా పోలీసులు అదుపులోకి తీసుకుని టార్చర్ పెట్టి, కరెంట్ షాక్ పెట్టొచ్చా? ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోరు? అని నిలదీశారు.
ఈ సంఘటనపై ఆ జిల్లా ఎస్పీ.. 'టార్చర్ చేయమంటేనే చేశాం' అని చెబుతున్నారు. అందుకే, పోలీసులపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవట్లేదని, ఈ విషయాన్ని తామూ వదలిపెట్టమని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
అంతేకాదు, ఇదేమీ కేసీఆర్ అయ్య జాగీర్ కాదు.. అడ్డగోలుగా ప్రవర్తించడానికి.. పోలీసులేమీ ఆయన ప్రైవేట్ సైన్యం కాదు.. ఈ విషయమై తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ప్రతిఘటిస్తుంది..' అని ఉత్తమ్ హెచ్చరించారు.