అంబానీ సోదరులతో కేసీఆర్ పోటీ: రేవంత్, కోమటిరెడ్డి ఇష్యూపై 10వ తేదీ వరకే గడువు
హైదరాబాద్: విభజన తర్వాత ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారిందని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రం అంబానీలతో పోటీ పడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం విమర్శలు గుప్పించారు. అవినీతిని ప్రశ్నిస్తే కేసీఆర్ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ఆరోపించారు.
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు దివాళా తీసిందన్నారు. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం అంబానీలతో పోటీ పడుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చాక ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రంలో విపరీతమైన అవినీతి జరుగుతోందని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టు అంచనాలు ఒక్కసారిగా ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. అంచనాలనురూ.5వేల 200 కోట్లకు పెంచుతూ ఎలా జీవో ఇస్తారని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పాలన్నారు. మీ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా అన్నారు.
రెండేళ్లలోనే సీతారామ ప్రాజెక్టు అంచనాలు 5వేల 200 కోట్లు ఎలా పెంచారని నిలదీశారు. ఎవరికి దోచిపెట్టేందుకు అంచనాలను ఇంతలా పెంచారో చెప్పాలన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఏం సమాధానం చెబుతారన్నారు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్లు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తే వాటికి సీతారామ ప్రాజెక్టు పేరు పెట్టడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేల ధిక్కరణ పిటిషన్
కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలన్న తీర్పును అమలు చేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులు హైకోర్టుకు శుక్రవారం తెలిపారు. తమకు మరో రెండు వారాలు గడువు కావాలన్నారు.
అయితే దీనికి న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 10 వరకు మాత్రమే గడువు ఇచ్చింది. తమను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ అమలు చేయడం లేదని కోమటిరెడ్డి, సంపత్ కుమార్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కోర్టు తీర్పు ఉత్తర్వుల అమలులో తమ పాత్ర లేదని, అసెంబ్లీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అసెంబ్లీ, న్యాయ కార్యదర్శులు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ జరిగినట్లు ప్రాథమికంగా ఆధారాలు కనిపిస్తున్నాయని గత విచారణలో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు వారికి వారం రోజుల గడువు ఇచ్చింది.