పీవీ సింధు ‘కర్ణాటక కూతురు’: ఇది ఓ సీఎం మాట!
హైదరాబాద్: ఒలింపిక్స్లో రజత పతకం సాధించి దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న పీవీ సింధు స్థానికతపై ఇప్పటికే చాలా పెద్ద చర్చలు జరుగుతున్నాయి. కొందరు తెలంగాణ బిడ్డ అంటుండగా, మరికొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమ్మాయి అంటూ చర్చను పెద్దది చేస్తున్నారు.
అదంతా కాదు.. పీవీ సింధు తెలుగమ్మాయి అని కొందరు వివాదానికి తెర దించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కోచ్ పుల్లెల గోపీచంద్ సమాధానమిస్తూ.. పీవీ సింధు భారతీయురాలని చెప్పి అందరి నుంచి ప్రశంసలందుకున్నారు.
కాగా, ఇప్పుడు మరోసారి అదే అంశం తెరపైకి వచ్చింది. ఎందుకంటే హర్యానా సీఎం మనోహర్ లాల్.. పీవీ సింధు కర్ణాటక కూతురు అంటూ అందరి దృష్టిని అటువైపు తిప్పుకున్నారు. పీవీ సింధు పేరును కూడా సరిగా పలకకపోవడం గమనార్హం. అయితే, ఆయనకు ఈ విషయంపై అవగాహన లేని కారణంగానే ఈ పొరపాటు జరిగిందని తెలుస్తోంది.
భారత్కు ఒలింపిక్స్లో తొలి పతకం అందించిన రెజ్లర్ సాక్షి మాలిక్ను ఘనంగా సన్మానించిన సందర్భంలో హర్యానా సీఎం ఈ పొరపాటు చేశారు. కాగా, సాక్షి మాలిక్కు హర్యానా ప్రభుత్వం నుంచి రూ. 2.5 కోట్లు అందించారు. అంతేగాక, 'బేటీ బచావో - బేటీ పడావో' పథకానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రచారకర్తగా సాక్షి మాలిక్ను నియమించారు.