రూ.1,00,899 బోనస్.. సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా... లాభాల్లో వాటా ప్రకటించిన కేసీఆర్
Recommended Video
హైదరాబాద్ : సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. బొగ్గు వెలికితీసేందుకు ప్రతి నిత్యం వారు మృత్యు ఒడిలోకి వెళ్లి తిరిగొస్తున్నారని పేర్కొన్నారు. వీరి పని సరిహద్దులో గస్తీ కాసే సైనికులకు ఏ మాత్రం తీసిపొదన్నారు. బొగ్గు ఉత్పత్తిలో వారి శ్రమ అనిర్వచనీయమని కొనియాడారు. ఎప్పటిలాగే వారికి ఇచ్చే బోనస్ మరో ఒక్క శాతం పెంచుతున్నామని ప్రకటించారు. ఈ ఏడాది ప్రతి కార్మికుడికి 28 శాతం బోనస్ అందజేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం కేసీఆర్.
బంపర్ బోనాంజా
సింగరేణి కార్మికుల సేవలను ప్రశంసించారు సీఎం కేసీఆర్. వారి అద్భుతమైన పనితీరుతో సంస్థ లాభాల్లో కొనసాగుతుందన్నారు. ప్రతీ కార్మికుడు బాధ్యతతో పనిచేస్తూ .. సంస్థను లాభాల బాట పటిస్తున్నారన్నారు. ప్రతీ ఏటా బొగ్గు ఉత్పత్తి పెరగడమే ఇందుకు నిదర్శమని కీర్తించారు. ఈ ఏడాది కూడా లాభాలు పెరిగాయాని గుర్తుచేశారు. సంస్థ లాభాల్లో ప్రతీ కార్మికుడికి 28 శాతం బోనస్ అందజేస్తామని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా కార్మికులకు ఈ మొత్తం అందజేస్తామని తెలిపారు.
బోనస్ ఎంత అంటే ?
సంస్థ లాభాల్లో 28 శాతం కార్మికులకు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంటే ఒక్కో కార్మికుడికి లక్షా 8 వందల 99 రూపాయలు చెల్లిస్తామని తెలిపారు. గతేడాది కార్మికులకు 27 శాతం బోనస్ అందజేశామని గుర్తుచేశారు. అప్పుడు ఒక్కో కార్మికుడికి 60 వేల 369 రూపాయలు చెల్లించామన్నారు. గతేడాది కంటే 40 వేల 530 రూపాయల బోనస్ పెరిగిందని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
లాభాల బాటలో ..
బొగ్గు ఉత్పత్తి పెరుగుతుందని .. దీంతో లాభాలు కూడా క్రమంగా పెరిగాయని చెప్పారు సీఎం కేసీఆర్. అపార ఖనిజ సంపదను వెలికితీసేందుకు కార్మికులు ప్రతి నిత్యం మృత్యు ఒడిలోకి వెళ్లి వస్తున్నారని గుర్తుచేశారు. సింగరేణి కార్మికులను కంటికి రెప్పాలా కాపాడుకుంటామని పేర్కొన్నారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో కార్మికుల గోడును పట్టించుకున్న నాథుడే లేడని పేర్కొన్నారు. గరిష్టంగా రూ.13 వేల 500 బోనస్ అందజేశారని గుర్తుచేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో బోనస్ క్రమంగా పెంచుతున్నామని వివరించారు.
శ్రమికుల స్వేదం ..
ఖనిజ సంపదను వెలికితీసేందుకు సింగరేణి కార్మికులు చిందిస్తోన్న స్వేదాన్ని ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు కేసీఆర్. అందుకు ప్రతిఫలంగానే బోనస్ అందజేస్తున్నామని తెలిపారు. సింగరేణి కార్మికులకు అన్నివిధలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఏ కష్టమొచ్చినా ఆదుకుంటామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు కేసీఆర్.