మార్చి 31 వరకూ అన్నీ బంద్.. సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన.. ఉచితంగా బియ్యం, డబ్బులు పంపిణీ.. ఇంకా..
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతం కావడంతో అదే స్ఫూర్తిని మరో తొమ్మిది రోజులు కొనసాగించాలని, మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్ లో కేబినెట్ మంత్రులు, ముఖ్య అధికారులతో హైలెవల్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. 31 వరకు ప్రజలెవరూ ఇళ్లు దాటి బయటికి రావొద్దని, కావాల్సిన సరుకులతోపాటు డబ్బును కూడా ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు. ఈ మేరకు అపెడమిక్ డిసీజ్ యాక్ట్- 1897(అత్యవసర పరిస్థితుల చట్టం)ను అమల్లోకి తీసుకొచ్చినట్లు వివరించారు. ఇంకా సీఎం ఏం చెప్పారంటే...
31 వరకూ బంద్..
జనతా కర్ఫ్యూ రోజు చూపించిన స్ఫూర్తితోనే ప్రజలంతా మార్చి 31 వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ఉంటే.. కరోనాను అడ్రస్ లేకుండా తరిమికొట్టొచ్చు. తద్వారా మనమంతా సేఫ్ గా ఉండొచ్చు. సర్వజనుల హితం కోసం చేస్తున్న ఈ పనిని అందరూ ఆశీర్వదించాలి. మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో.. అత్యవసర పరిస్థితుల చట్టం- 1897(ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్) ను అనుసరించి ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నాం. అందులో భాగంగా మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్రమంతా లాక్ డౌన్ లో ఉంటుంది. ప్రజలెవరూ ఇళ్లు వదిలి బయటికి రావొద్దు. ఎక్కడైనా సరే, ఐదుగురికి మించి గుమ్మికూడొద్దు. ఈ నిబంధన చాలా సీరియస్ గా అమలవుతుంది. బయటికి వచ్చినా.. కనీసం మూడు ఫీట్ల దూరాన్ని పాటించాలి.
ఒక్కరికి మాత్రమే అనుమతి..
ఇల్లు గడవటానికి అవసరమైన పాలు, కూరగాయలు, నిత్యావసరాల కోసం మాత్రమే.. అది కూడా ఇంటికి ఒక్కరినే బయటికి రానిస్తాం. అంతకు మించి ఎవరినీ పర్మిట్ చేయబోం. ఒక సారి బయటికొస్తే.. వీలైనన్ని ఎక్కువ సరుకులు తీసుకెళ్లాలి. మనల్ని మనం కాపాడుకోవాలనే సోయిని నిత్యం కలిగి ఉండాలి. దీన్నేదో బలవంతపు ప్రక్రియగా ఫీలవ్వొద్దు.
ఫ్రీగా బియ్యం.. ఇంటికో రూ.1500
రెక్కాడితేగానీ డొక్కాడని పేదలు, రోజుకూలీలు కూడా ఇళ్లు కదలడానికి వీల్లేదు. వాళ్లందరికీ నెల రోజులకు సరిపడా సరుకులు ఇంటికే అందిస్తాం. తెలంగాణలో మొత్తం ఒక 1.3కోట్ల కుటుంబాలు ఉండగా, అందులో 87.59లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులున్నాయి. వాళ్లందరికీ.. ఫ్రీగా (ఒక్కో వ్యక్తికి)12 కేజీల బియ్యాన్ని అందిస్తాం. రేషన్ డీలర్ల ద్వారానే సరఫరా చేస్తాం. మామూలుగా నెలకు 1.50 వేల టన్నుల బియ్యం వెళతాయి. ఈసారి 3.36వేల టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తాం. దీనికి విలువ దాదాపు 1103 కోట్ల రూపాయలు. బియ్యంతోపాటు ప్రతి కుటుంబానికి రూ.1500 నగదు ఇస్తాం. దాంతో అవసరమైన సరుకులు కొనుక్కోవచ్చు. ఇందుకోసం 1314 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నది. మొత్తంగా 2417 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం విడుదల చేసింది.
ఉద్యోగులు రావొద్దు.. విద్యా వ్యవస్థ బంద్..
ప్రభుత్వ ఉద్యోగులందరూ సోమవారం నుంచి కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. కొన్ని అత్యవసర సర్వీసుల వాళ్లు మాత్రం విధిగా రావాల్సిందే. హెల్త్, పవర్ లాంటి సెక్టార్లలో ఉద్యోగులు 100 శాతం హాజరు కావాల్సిందే. మిగతా శాఖల్లో మాత్రం రోజుకు 20 శాతం చొప్పున రొటేషన్ పద్ధతిలో విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. విద్యారంగానికి సంబంధించి అన్ని కార్యక్రమాలను బంద్ పెట్టాం. పదో తరగతి పరీక్షల నుంచి ఇంటర్ పేపర్ వాల్యువేషన్ దాకా అన్ని ఎక్కడికక్కడే నిలిచిపోతాయి. మార్చి 31న రివ్యూ మీటింగ్ తర్వాత మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తాం. అప్పటిదాకా ఏపని చేయరాదు.
ప్రైవేటు ఉద్యోగులకు జీతాలివ్వాల్సిందే..
1897 యాక్ట్ ప్రకారం టోటల్ లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పుడు.. అసంఘటితరంగంలో పనిచేస్తోన్న వర్కర్లు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్టు సిబ్బందికి ఆయా యాజమాన్యాలు.. తప్పనిసరిగా జీతాలు చెల్లించాల్సిందే. ప్రభుత్వం కూడా తన శాఖల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తుంది. ఇండస్ట్రియల్ సెక్టార్ కు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. క్రైసిస్ పరిస్థితుల్లో అందరం భాగస్వాములు కావాల్సిందే. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సిందే. లాక్ డౌన్ కాలంలో ఆయా సంస్థలు.. తమ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలి.
ఆస్పత్రులు.. అంగన్ వాడీలు కూడా..
జనం గుమ్మికూడే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్రంలోని అన్ని అంగన్ వాడీ సెంటర్లను కూడా మూసేసున్నాం. వాళ్లకు అందించే సరుకుల్ని ఇళ్లకే చేరవేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణుల జాబితాను సిద్ధం చేస్తున్నాం. వాళ్లందరికీ జాగ్రత్తగా వైద్యం అందిస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో.. అత్యవసరంలేని సర్జరీలను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ అయితే తప్ప ఆపరేషన్లు చేపట్టరాదు. దేశం బాగుండాలంటే వైద్యులు, వైద్య సిబంది సురక్షతంగా ఉండాలి. కాబట్టి వాళ్లను కాపాడుకునే బాధ్యలో మనందరం భాగం కావాలి. ప్రస్తుతానికి ఫోకస్ మొత్తం కరోనాపైనే ఉంచాం. మొత్తం వ్యవహారాలకు సంబంధించి ఆరోగ్య మంత్రి ప్రతి రోజూ బులిటెన్ విడుదల చేస్తారు’’అని సీఎం కేసీఆర్ వివరించారు.