కెసిఆర్ హామీలు నెరవేరతాయా: 85 వేల ఉద్యోగాల భర్తీ సాధ్యమేనా?
నీళ్లను బీళ్లకు మళ్లించే ప్రక్రియ సాగుతూనే ఉన్నది. అదే సమయంలో నియామకాలు చేపట్టాల్సిన సంగతిని ఏలిన వారు ఇప్పటి వరకు విస్మరించారా? లేక విస్మరించినట్లు నటించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్: మాటల మాంత్రికుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. వ్యాఖ్యలతోనే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపగల సమర్థుడంటే అతిశేయోక్తి కాదు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి తొలి ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు దాటిపోయింది. మరో ఏడాదిలోగా ఎన్నికల సమరానికి సంసిద్ధం కావాల్సిన తరుణం రోజురోజుకు దగ్గరవుతోంది.
'నీళ్లు - నిధులు - నియామకాలు' నినాదంగా సాగిన రాష్ట్ర ఉద్యమ డిమాండ్లలో నిధులను తెలంగాణ కోసమే ఖర్చుచేసుకుంటున్న పరిస్థితి. నీళ్లను బీళ్లకు మళ్లించే ప్రక్రియ సాగుతూనే ఉన్నది. అదే సమయంలో నియామకాలు చేపట్టాల్సిన సంగతిని ఏలిన వారు ఇప్పటి వరకు విస్మరించారా? లేక విస్మరించినట్లు నటించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఏర్పాటైన మూడేళ్ల తర్వాత కూడా కేవలం ఏడెనిమిది వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం వాదన మరోలా ఉన్నదంటే అతిశేయోక్తి కాదు.
రెండేళ్ల క్రితం పోలీసుశాఖలో కానిస్టేబుళ్ల నియామకానికి 10 వేల మందికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. ఎస్సై పోస్టులకు నిర్వహించిన పరీక్షా ఫలితాలే ఇంకా వెల్లడి కాలేదు. రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. సుప్రీంకోర్టు మొట్టి కాయలు వేసినా వైఖరి మారలేదని తాజా పరిణామాలు చెప్తున్నాయి. ఇంతకుముందు అసెంబ్లీ సాక్షిగా సుమారు 1.05 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కానీ ఆచరణలో ఇంతవరకు ఆయా శాఖల పనితీరుకు తప్పనిసరిగా అవరోధాలు లేకుండా చూసుకునేందుకు అవసరమైన నియామకాలు మాత్రమే చేపట్టారు తప్ప.. మిగతా ఖాళీల భర్తీ సంగతే విస్మరించారు.
వచ్చే ఏడాది ఉద్యోగాలపై ఇలా చర్యలకు సీఎం ఆదేశం
కానీ 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగిన చారిత్రక గోల్కొండ సాక్షిగా అర్ధ సత్యాలు చెబుతూ సబ్బండ తెలంగాణ వర్ణాలను మాయజేయడానికి పూనుకున్నారని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన 27,660 నియామకాలకు తోడుగా మరో 84,876 ఉద్యోగాల ని యామక ప్రక్రియను సత్వరమే చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. వచ్చే యాసంగి నుంచి వ్యవసాయానికి 24గంటల కరెంటును అందించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు హామీలు గుప్పించారు.
వచ్చే ఏడాది ఖాళీ అయ్యే ఉద్యోగాలను గుర్తించి, ఈ ఏడాదే భర్తీ చేయడానికి ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉన్నది. మూడేళ్లలో కేవలం ఏడెనిమిది వేల లోపు ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిన పాలకులు కేవలం ఏడాది వ్యవధిలో 85 వేల ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టడమంటే అత్యంత సాహసోపేత నిర్ణయమే. ఇందులో ఆయా శాఖల క్లియరెన్సులు.. ఎటువంటి న్యాయపరమైన ఆటంకాలు తలెత్తకుండా నోటిఫికేషన్లు జారీ కావాలి.. తర్వాత ప్రశ్నాపత్రాల్లో ఎటువంటి తప్పులు దొర్లకుండా సజావుగా రాత పరీక్షలు పూర్తయితేనే తదుపరి నియామక ప్రక్రియసాగుతుందని నిరుద్యోగ యువత అభిప్రాయ పడుతున్నారు.
Recommended Video
టీచర్ ఉద్యోగాలపై సుప్రీం ఇలా కొరడా
ఇప్పటివరకు 27,600 ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాయని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు జరిగిన నియామకాలు పది వేల లోపు మాత్రమే. మరో 36,806 నియామకాల ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నదని పేర్కొన్నారే గానీ ఏయే శాఖల పరిధిలో ఏయే ఉద్యోగాలు భర్తీ చేశారో వివరాలేమీ లేవు. కేవలం శాఖల వారీగా ఉద్యోగాల నియామక ప్రక్రియ జాబితాలో నంబర్ల గేమ్కు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి.. నిరుద్యోగులను మభ్య పెట్టడానికే ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు శాఖ నుంచి 37,820 ఉద్యోగాలు నియమిస్తామన్నారు. అందులో 10,499 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో కొందరి విషయమై తామిచ్చే ఆదేశాలకు కట్టుబడి ఉండాలని హైకోర్టు ఆదేశించిన సంగతి అందరికీ తెలిసిందే. గ్రూప్ - 2 నియామకాలకు నిర్వహించిన పరీక్ష ఫలితంపైనా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వచ్చే ఏడాదితో కలిపి 12 వేల టీచర్ పోస్టుల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఏ మేరకు టీచర్ల నియామక ప్రక్రియ పూర్తవుతుందో మరి వేచి చూడాల్సిందే.
హైకోర్టు ఆదేశంలో నిలిచిపోయిన ఔట్ సోర్సింగ్ క్రమబద్దీకరణ
ఇక విద్యుత్ రంగ సంస్థలు టీఎస్ ట్రాన్స్ కో, జెన్ కోల్లో సుమారు 12,961 ఉద్యోగాల నియామకానికి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇటీవలే ఈ సంస్థల్లో పని చేస్తున్న 20 వేల మంది పై చిలుకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల భర్తీకి ప్రభుత్వం విఫలయత్నం చేసింది. కానీ 2014కి ముందు ఈ రంగాల్లో నియామకమైన వారు అతి కొద్ది మంది మాత్రమే. అదే ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సాక్షిగా కేసీఆర్.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలే ఉండవని తేల్చి చెప్పారు. కానీ ఈనాడు కేవలం విద్యుత్ రంగ సంస్థల్లోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు 20 వేల పై చిలుకు ఉన్నాయంటే వాస్తవ పరిస్థితి.. ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వ చిత్తశుద్ది ఏమిటో అవగతమవుతూనే ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. హైకోర్టు అడ్డుకోవడంతో విద్యుత్ రంగ సంస్థల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది.
ఉద్యోగ నియామకాలపై పారదర్శకతపై ఘంటా చక్రపాణి ఇలా
స్వాతంత్య్ర దిన సంబురాల్లో తెలంగాణ ప్రభుత్వం యువత.. ఉద్యోగాల కల సాకారం దిశగా మరిన్ని నోటిఫికేషన్లతో సంతోషాన్ని తెచ్చిపెట్టింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) జెండా పండుగ సందర్భంగా పెద్దఎత్తున కొలువుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 9 నోటిఫికేషన్ల ద్వారా 2,345 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. వైద్యారోగ్యశాఖ, అటవీశాఖల్లో ఖాళీగా ఉన్న కొలువులను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగాల విద్యార్హతలు, కొలువుల ఇతర వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం తమ వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల ఆకాంక్షలు ఫలించేలా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకుపోతున్నట్టు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఇప్పటివరకు భర్తీచేసిన ఉద్యోగాల్లో పారదర్శకతకు పెద్దపీట వేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
టీచర్ పోస్టుల భర్తీపై సీఎం ఇలా ఆదేశాలు
త్వరలో ప్రకటించనున్న డీఎస్సీలో టీచర్ పోస్టులు పెరుగనున్నాయి. విడుదలకు సిద్ధమవుతున్న డీఎస్సీ (టీచర్స్ రిక్రూట్మెంట్) నోటిఫికేషన్లో 2017 వరకు ఉన్న ఖాళీలను కూడా చేర్చాలని సీఎం కే చంద్రశేఖర్రావు ఆదేశించినట్లు తెలిసింది. ప్రస్తుతం డీఎస్సీలో 8,792 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఇందులో 2015 నాటికి ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. 2017 జూన్ వరకు ఏర్పడిన టీచర్ల పోస్టుల ఖాళీలను కూడా ఇదే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే విషయమై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో సీఎం కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది.
ఈ ఖాళీలను ఒక డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలా? లేక రెండు డీఎస్సీల ద్వారా భర్తీ చేయాలా? అనే అంశంమీద కొంత చర్చ తర్వాత రెండింటిమీద పూర్తి వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో 31 జిల్లాల్లో నాలుగు వేల టీచర్ పోస్టులు పెంచే అవకాశం ఉన్నదిదని తెలిసింది. కొత్తగా ఏర్పాటైన ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో ఇంగ్లిషు టీచర్ల పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే విషయాన్నీ పరిశీలించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. వచ్చే వారానికల్లా పూర్తి ప్రతిపాదనలతో సిద్ధంగా ఉండాలని కడియం శ్రీహరిని, విద్యాశాఖ అధికారులను సీఎం ఆదేశించారు.