ప్రతి ఇంటికి రూ. 10వేలు, కూలితే లక్ష: సీఎం కేసీఆర్, రూ. 550 కోట్ల విడుదల, విరాళాలకు విజ్ఞప్తి
హైదరాబాద్: రాజధాని నగరం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నగరంలో ఇప్పటికే 50 మంది వరకు మృతి చెందగా, భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి.. పలు ఇళ్లు కూలిపోయాయి.
Recommended Video
వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు
ప్రతి ఇంటికి రూ. 10వేల సాయం
ఈ క్రమంలో వరద ప్రభావానికి గురైనవారికి సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించారు. నగరంలో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ. 10వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు సోమవారం ప్రకటించారు. పూర్తిగా ఇల్లు కూలిపోయినవారికి పరిహారంగా రూ. లక్ష, పాక్షికంగా దెబ్బతిన్నవారికి రూ. 50వేల చొప్పున ఇస్తామని తెలిపారు.
రూ. 550 కోట్ల విడుదల
భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. పేదలకు సాయం కోసం పురపాలక శాఖకు రూ. 550 కోట్లు తక్షణమే విడుదల చేస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. కాగా, వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.
విరాళాలకు ముందుకు రావాలి కేసీఆర్.. తమిళ సీఎంకు ధన్యవాదాలు
నష్టపోయిన ప్రజలు ఎంత మంది ఉన్నా సాయం అందిస్తామని, లక్ష మందికైనా సరే సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య ప్రముఖులు, ఇతర రంగాల ప్రముఖులు కూడా ముందుకు రావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేయాలని కోరారు. రూ. 10 కోట్ల విరాళం అందించిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఈ సందర్భంగా కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
మరోసారి వర్షాలు.. బెంబేలెత్తుతున్న హైదరాబాద్ జనం
ఇది ఇలావుండగా, గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు సోమవారం కూడా వర్షం కురిసింది. నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, కోఠి, బేగంబజార్, కింగ్ కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, నారాయణగూడ, లక్డీకపూల్, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, జియాగూడ, మల్కాజిగిరి, ముషీరాబాద్, నాచారం, తార్నాక, కాప్రా, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్ పేట్, చార్మినార్, జీడిమెట్ల, కొంపల్లిలో వర్షం పడింది. మరోసారి రోడ్లన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. మరో రెండ్రోజులు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాగా, వర్షాలు, వరదల నేపథ్యంలో పూరానాపూల్ వంతెన బాగా దెబ్బతింది. పగుళ్లు రావడంతో రాకపోకలు నిలిపివేశారు.