గ్రేటర్ ఎన్నికల వేళ..నాన్-హిందీ బెల్టుకు మేలు చేసేలా..కీలక ప్రతిపాదనలతో మోదీకి కేసీఆర్ లేఖ...
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి కీలక ప్రతిపాదనలతో ఓ లేఖ రాశారు. విపక్షాల కాంక్లేవ్ పేరుతో ప్రత్యామ్నాయ రాజకీయాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన కేసీఆర్... దక్షిణాది రాష్ట్రాలకు ఉపయుక్తంగా ఉండే ఓ కీలక ప్రతిపాదనను తెర పైకి తీసుకొచ్చారు.
ఇంగ్లీష్,హిందీ భాషల్లో మాత్రమే నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలన్నింటినీ తెలుగు సహా మిగతా ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో నిరుద్యోగులంతా సీఎంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న వేళ... కేసీఆర్ ఉద్యోగాలకు సంబంధించిన కీలక ప్రతిపాదనను మోదీ ముందు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ ఏం కోరారు...
దేశ అత్యున్నత సర్వీసులైన సివిల్స్ మొదలు బ్యాంకింగ్స్,రైల్వే,ఆర్బీఐ,స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని లేఖ ద్వారా సీఎం కోరారు. కేవలం ఆ రెండు భాషల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించడం ద్వారా.. ఇంగ్లీష్ మీడియం చదవనివారికి,హిందీ రాష్ట్రాలకు చెందనివారికి తీవ్ర ప్రతికూలత ఎదురవుతోందన్నారు. కాబట్టి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించేందుకు... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను విద్యార్థులు ప్రాంతీయ భాషల్లో రాసేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
పీవీ తపాలా స్టాంపు.. రాష్ట్రపతికి లేఖ...
మరో లేఖను సీఎం కేసీఆర్ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్కు రాశారు. దేశ మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు స్మారక తపాలా స్టాంపును తీసుకొచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఆ స్టాంప్ను మీ చేతుల మీదుగా హైదరాబాద్లో విడుదల చేయాలని రాష్ట్రపతిని ఉద్దేశించి పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్లో నిర్వహించనున్న సౌతిండియా సోజర్న్ కార్యక్రమం సందర్భంగా ఆ స్టాంపును విడుదల చేస్తే బాగుంటుందన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పీవీ... కేవలం ఆర్థిక సంస్కరణలు మాత్రమే కాదు,అంతర్జాతీయ సంబంధాలు,కళలు,గ్రామీణ అభివృద్ది,శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతికి కృషి చేశారని లేఖలో గుర్తుచేశారు.
అన్ని రాష్ట్రాల కామన్ డిమాండుతో
కేంద్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు తానే యుద్దం శంఖం పూరించబోతున్నట్లు కేసీఆర్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ రెండో వారంలో హైదరాబాద్ వేదికగా విపక్షాల కాంక్లేవ్ నిర్వహించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఎండగట్టిన ఆయన... ఈ దేశానికి బీజేపీయేతర,కాంగ్రెస్యేతర రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని పునరుద్ఘాటించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేసీఆర్ చేసిన కామెంట్స్ కాకతాళీయమేనా... లేక నిజంగానే ఆ ప్రణాళిక దిశగా సాగుతున్నారా అన్న చర్చకు తెరలేపాయి. ఇదే క్రమంలో ప్రాంతీయ భాషల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించాలంటూ... అన్ని రాష్ట్రాల తరుపున ఒక కామన్ డిమాండ్ను కేసీఆర్ తెర పైకి తీసుకురావడం భవిష్యత్ రాజకీయానికి క్షేత్రస్థాయిలో వ్యూహాత్మక ప్రాతిపదికను ఏర్పరుచుకోవడమా అన్న చర్చ జరుగుతోంది.
Recommended Video
నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నవేళ...
రాష్ట్రంలో నిరుద్యోగులంతా కేసీఆర్పై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలపై కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల సందర్భంలో లేఖ రాయడం కూడా చర్చించుకోవాల్సిన అంశం. కేసీఆర్ చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తే... నిజానికి ఈ డిమాండ్ విద్యార్థుల్లో చాలాకాలంగా ఉంది. కేవలం ఇంగ్లీష్,హిందీ భాషల్లో ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించడం హిందీ బెల్ట్ విద్యార్థులకు మేలు చేస్తోందన్న వాదన ఉన్నది. ఈ విధానంలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఒడిశా,బెంగాల్,ఈశాన్య రాష్ట్రాలు నష్టపోతున్నాయన్న విమర్శ ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన డిమాండుకు రాజకీయంగా,విద్యార్థుల పరంగా గట్టి మద్దతు లభించే అవకాశం కనిపిస్తోంది.