అసెంబ్లీలో సీఏఏపై చర్చ.. అక్బరుద్దీన్,రాజాసింగ్లకు కేసీఆర్ కీలక విజ్ఞప్తి..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో సీఏఏపై మాట్లాడటం సరికాదన్నారు. సీఏఏపై ఇప్పటికే బీఏసీలో నిర్ణయం తీసుకున్నారని.. అవసరమైతే సగం రోజు దానికే కేటాయించి అందరి అభిప్రాయాలను పంచుకుందామని తెలిపారు. సీఏఏ,ఎన్పీఆర్ వంటి విషయాల్లో ఆయా పార్టీలకు భిన్నాభిన్నాయాలు ఉంటాయని.. కచ్చితంగా సభలో ఆ అభిప్రాయాలను పంచుకునేందుకు స్పీకర్ సమయం ఇస్తారని చెప్పారు.
సీఏఏ అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద జరుగుతోందని.. తర్వాత తరాలపై కూడా ప్రభావం చూపై ఇలాంటి చట్టాలపై చర్చ అవసరమని కేసీఆర్ అన్నారు. ఇప్పటికే ఐదారు శాసనసభలు సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం చేశాయని.. తాము కూడా సీఏఏ వ్యతిరేక తీర్మానం చేస్తామని చెప్పారు. కేంద్రం దాన్ని అంగీకరిస్తుందా లేదా అన్నది పక్కనపెడితే.. దేశ రాజధానిలో 40 మందికి పైగా బలైపోయిన అంశంపై చర్చ అవసరమన్నారు.
భిన్నాభిప్రాయాలు ఉండేదే ప్రజాస్వామ్యం అని.. బీజేపీ,కాంగ్రెస్,మజ్లిస్లు సభలో తమ అభిప్రాయాలను పంచుకోవచ్చునని చెప్పారు. సీఏఏ విషయంలో చాలా అనుమానాలు,అపోహలు ఉన్నాయని.. అందరి అభిప్రాయాలను ఓపిగ్గా విందామని అన్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలేనని.. సీఏఏపై ఎవరు తప్పు మాట్లాడితే వారికి శిక్ష వేస్తారని అన్నారు.
Recommended Video
కాబట్టి మజ్లిస్ శాసన సభ్యుడు అక్బరుద్దీన్,బీజేపీ శాసనసభ్యుడు రాజాసింగ్లు ప్రస్తుతానికి ఆ సబ్జెక్ట్ పక్కనపెట్టి.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడాలన్నారు. అందరి సహకారంతో సభను సజావుగా జరుపుకుందామని విజ్ఞప్తి చేశారు.