ఏపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఢిల్లీలో బతిమాలా: రాజీవ్ శర్మపై కేసీఆర్, మరో పదవి
తెలంగాణ రాష్ట్ర చీఫ్ అడ్వైజర్గా రాజీవ్ శర్మను నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. సీఎస్ నేడు పదవీ విరణ చేసిన ఆయన సేవలను మరింత వినియోగించుకుంటామన్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి ఎదురైన సవాళ్లను రాజీవ్ శర్మ ఓపికతో అధిగమించారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు అన్నారు. రాజీవ్ శర్మ ఈ రోజు పదవీ విరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో వీడ్కోలు సభకు కేసీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. విభజన తర్వాత ఏపీ దుగ్ధతో తెలంగాణను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందన్నారు. వాటన్నింటిని రాజీవ్ శర్మ ఓపికతో అధిగమించారని చెప్పారు. రాజీవ్ శర్మను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంచాలని తాను ఢిల్లీలో రిక్వెస్ట్ చేశానని చెప్పారు.
డిఎస్ స్థానంలో సలహాదారుగా వివేక్, కొత్త సీఎస్గా ప్రదీప్ చంద్ర
పునర్విభజనలోని ప్రతి అంశం తెలుసు
శ్రీకృష్ణ కమిటీలోను రాజీవ్ శర్మ కీలకంగా ఉన్నారని చెప్పారు. పునర్విభజనలోని ప్రతి అంశం రాజీవ్ శర్మకు తెలుసునని చెప్పారు. ముసాయిదా తయారీ సమయంలో కేంద్ర హోంశాఖలో ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. జిల్లాల పునర్విభజనలోను రాజీవ్ కీలకంగా వ్యవహరించారని చెప్పారు.
ఆయన వల్లే
సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులో పూర్తి చేయగలిగామంటే అది సీఎస్ రాజీవ్ శర్మ కృషి ఫలితమేనన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో కూడా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ప్రశాతంగా పూర్తి చేయగలిగారని అభినందించారు.
విపత్కర పరిస్థితుల్లోనూ ధైర్యంగా పనిచేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేశారని కొనియాడారు. ఏపీ నుంచి ఎదురైన సవాళ్లను అధిగమించారన్నారు. తెలంగాణ కొత్తగా ఏర్పడినా మన అనుభవాలను ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. రాజీవ్ శర్మ, అనుభవ అధికారులు ఉండడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు.
తెలంగాణ చీఫ్ అడ్వైజర్గా రాజీవ్ శర్మ
తెలంగాణ రాష్ట్ర చీఫ్ అడ్వైజర్గా రాజీవ్ శర్మను నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఆయన సేవలను మరింత వినియోగించుకుంటామన్నారు.
కేసీఆర్తో పని చేయడం అద్భుతం: రాజీవ్ శర్మ
ముఖ్యమంత్రి కేసీఆర్తో పని చేయడం తన అదృష్టమని రాజీవ్ శర్మ అన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు అద్భుతమని కొనియాడారు. తనకు వీడ్కోలు సభ నిర్వహించినందుకు కేసీఆర్కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.
ఈ కార్యక్రమంలో నూతన సీఎస్ ప్రదీప్ చంద్ర, రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, కేటీఆర్, నాయిని నర్సింహా రెడ్డి, హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, చందూలాల్, పోచారం శ్రీనివాస రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజీవ్ శర్మను సీఎం, మంత్రులు, అధికారులు ఘనంగా సత్కరించారు. వేద పండితులు ఆశీర్వదించారు.