ఢిల్లీకి కెసిఆర్, రేపు బిజీబిజీ: నిధుల కోసం మోడీ, జైట్లీలతో భేటీ
హైదరాబాద్: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన వెంట ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ వెళ్తున్నారు. నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రాల్లో అమలు చేసే పథకాలపై సబ్ గ్రూపు రూపొందించే తుది నివేదికను ప్రధాని నరేంద్ర మోడీకి కేసీఆర్ అందిస్తారు.
ఆయన ఢిల్లీలో మూడు రోజుల పాటు ఉంటారు. మంగళవారం నాడు బిజిబిజీగా గడపనున్నారు. ఆయన సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీ బయలుదేరుతారు. మంగళవారం ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక, ఉపరితల రవాణా మంత్రులతో భేటీ అవుతారు. రేపు ఉదయం 11.45 గంటలకు అరుణ్ జైట్లీతో, మధ్యాహ్నం 2.30 గంటలకు నితిన్ గడ్కరీతోను సమావేశమవుతారు. రేపు సాయంత్రం 7 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారని తెలుస్తోంది.
డిసెంబర్ నెలలో తాను తలపెట్టిన చండీయాగానికి ప్రధాని మోడీని కేసీఆర్ ఆహ్వానించనున్నారు. కెసిఆర్ తన ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రానికి నిధుల పెంపు, ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపుపై ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం చర్చించనున్నారని తెలుస్తోంది.
కాగా, తెలంగాణ సీఎం కెసిఆర్ పైన తెలంగాణ టిడిపి నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు! తెలంగాణ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రిని ప్రశంసించారు. యాదాద్రి అభివృద్ధిపై కెసిఆర్ను అభినందిస్తున్నట్లు మోత్కుపల్లి చెప్పారు. అదే సమయంలో టిడిపి నేతలు ఎర్రబెల్లి, ఎల్ రమణ తదితరులు రైతుల విషయమై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి కొంత మౌనంగా ఉన్నారు.
రుణ మాఫీ ఒకే దఫాలో చెల్లిస్తాం: మంత్రి పోచారం
తెలంగాణలో రైతుల రుణ బకాయిలు ఒకే దఫాలో చెల్లించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కరవు మండలాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. మంగళవారం నుంచి 8వ జాతీయ విత్తన సదస్సు హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ప్రారంభమవుతుందన్నారు.