పీవీ సింధుని అందించాం, వీలుంటే ఓసారి చూసి వెళ్లండి: అథ్లెట్లకు కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి క్రీడలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు అన్నారు. పీవీ సింధు లాంటి ప్రపంచస్థాయి క్రీడాకారిణిని అందించడం గర్వంగా ఉందన్నారు.
ఆనందంగా ఉంది
గచ్చిబౌలీ స్టేడియంలో అఖిల భారత పోలీస్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ముగింపు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అఖిల భారత పోలీస్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భాగం కావడం ఆనందంగా ఉందని చెప్పారు.
అన్నీ సిద్ధం చేశాం
యాభై ఆరేళ్ల తర్వాత ఏళ్ల తర్వాత హైదరాబాద్లో ఈ పోటీలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో క్రీడల కోసం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మౌలిక వసతుల్ని ఏర్పాటు చేశామని, సీఐఎస్ఎఫ్ కోరగానే పోలీస్ మీట్ కోసం అన్నీ సిద్ధం చేశామని చెప్పారు. క్రీడల టవర్ ఏర్పాటు చేశామన్నారు.
క్రీడలు అవసరం
తెలంగాణ ప్రభుత్వంలోని అన్ని సంస్థలు సమన్వయంతో పని చేసి ఏర్పాట్లు చేశాయన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడం కోసం పోలీసులు ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్నారని, వారు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి క్రీడలు అవసరమన్నారు.
తెలంగాణను చూసి వెళ్లండి
ఈ టోర్నీలో పాల్గొన్న అథ్లెట్లందరూ హైదరాబాద్ ఆతిథ్యాన్ని ఆస్వాదించారని భావిస్తున్నానని, వీలుంటే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి ఇక్కడి గొప్ప సంస్కృతి, సంప్రదాయాల్ని తెలుసుకోవాలని కోరుతున్నానని చెప్పారు.
హాజరైనవారు
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్, క్రీడల మంత్రి పద్మారావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, డీజీపీ అనురాగ్ శర్మ, క్రీడల ముఖ్యకార్యదర్శి వెంకటేశం, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, సీఐఎస్ఎఫ్ ఏడీజీ ధర్మేంద్ర కుమార్, ఐజీ జగ్బీర్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఛాంపియన్ సిఆర్పీఎఫ్
ఐదు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో సీఆర్పీఎఫ్ ఓవరాల్ జట్టు ఛాంపియన్షిప్ గెలుచుకుంది. క్రీడాకారులు ముగింపు కార్యక్రమంలో మార్చ్పాస్ట్తో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.