స్పీకర్ పోచారం తల్లి మృతిపై ముఖ్యమంత్రి సంతాపం.. ఫోనులో పరామర్శ
హైదరాబాద్ : అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి పరిగె పాపవ్వ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి మాతృవియోగం సమాచారం తెలుసుకున్న కేసీఆర్.. ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం పోచారంలో బుధవారం మధ్యాహ్నం పాపవ్వ అంత్యక్రియలు జరగనున్నాయి.
కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న పాపవ్వ మంగళవారం రాత్రి 11-12 గంటల మధ్య బాన్సువాడలో తుదిశ్వాస విడిచారు. 107 ఏళ్లున్న పాపవ్వ 2 రోజుల కిందట తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దాంతో బాన్సువాడ ఏరియా హాస్పిటల్ కు తరలించి వైద్యం అందించారు. తల్లిని ఆసుపత్రికి తరలించారనే సమాచారంతో శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నుంచి బాన్సువాడకు చేరుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర వైద్యం అందిస్తుండగానే మంగళవారం రాత్రి కన్నుమూశారు.
తల్లి అంటే వీపరీతమైన గౌరవం చూపించే శ్రీనివాస్ రెడ్డికి.. ఆమె మరణం తీరని లోటు అని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. తాను ఏదైనా పని తలపెట్టినప్పుడు తల్లి ఆశీర్వాదం తీసుకోవడం ఆయనకు అలవాటు. ఇప్పటివరకు ఆయన పోటీ చేసిన ప్రతిసారి మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే నామినేషన్ వేశారు. పాపవ్వ మరణంతో ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.