దరిద్రో నారాయణ, గరిబీ హఠావో నినాదాలు ఇంకెన్నాళ్లు : మహబూబాబాద్ సభలో కేసీఆర్ విసుర్లు
మహబూబాబాద్ : ఎన్నికల ప్రచారం ముగింపునకు చేరుకుంటోన్న తరుణంలో వయోజనులను ఆకట్టుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే ఏం చేస్తామో అనే అంశాలను వివరిస్తూ ముందుకుసాగుతున్నారు. ఇవాళ సీఎం కేసీఆర్ మహబూబాబాద్లో ప్రచారం నిర్వహించారు.
నమో నమ:, రాగానేనా ?
దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు అధికారం చేపట్టాలా ? అని ప్రశ్నించారు కేసీఆర్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ అనుబంధ పథకంగా చేర్చాలని అప్పటి మన్మోహన్ సింగ్, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ పెడచెవిన పెట్టారని విమర్శించారు. రాష్ట్రాల ప్రయోజనాలు వారికి పట్టవని మండిపడ్డారాయన. మోదీ, రాహుల్ .. ఇద్దరూ దొంగ దొంగ అని ఆరోపించుకోవడం ఏంటని నిలదీశారు.
దరిద్రో నుంచి గరిబీ
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్ధాలు పూర్తవుతోంది. కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా మారిందని విమర్శించారు. 1947లో అప్పటి ప్రధాని నెహ్రూ దరిద్రో నారాయణో అని పిలుపునిచ్చారు. తర్వాత పీఎం పీఠం అధిష్టించినా ఇందిరాగాంధీ గరిబీ హఠావో అన్నారు. తర్వాత రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు సంస్కరణలు పేరు చెప్పారు. ఇప్పుడు తన నాయనమ్మ లాగా రాహుల్ గరిబీ హఠావో అంటున్నారు. ఇంకెన్నాళ్లు హఠావో అంటారని ప్రశ్నించారు కేసీఆర్.
రెవెన్యూ పేరు మారుస్తాం ?
రెవెన్యూ శాఖ పేరు బాగోలేదన్నారు సీఎం కేసీఆర్. బ్రిటిష్ కాలంలో భూమి శిస్తు వసూల్ చేసేవారని గుర్తుచేశారు. నీటి తీరువా పన్ను ఉండేదని తెలిపారు. ఇప్పుడు ఆ పన్నులు లేనందున రెవెన్యూ శాఖ పేరు మారుస్తానని సంకేతాలిచ్చారు. అలాగే కలెక్టర్ పేరు కూడా మారుస్తామని స్పష్టంచేశారు. శిస్తు వసూల్ చేసేవారిని కలెక్టర్ అనేవారని .. ఇప్పుడు అదీ లేనందున జిల్లా ప్రధాన అధికారిగా పేరు మారుస్తామని స్పష్టంచేశారు కేసీఆర్.
దేశానికి ఆదర్శం తెలంగాణ
వివిధ సంక్షేమ పథకాల అమల్లో భాగంగా దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు సీఎం కేసీఆర్. మహబూబాబాద్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఇక్కడ మెడికల్ కాలేజీ నిర్మిస్తామని హామీనిచ్చారు. భూ సంబంధం పంచాయితీ లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. పోడు భూముల సమస్య ప్రత్యేకదృష్టి సారిస్తామని పేర్కొన్నారు.