పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
పార్టీ ఎంపీలతో కేసీఆర్ కీలక భేటీ కానున్నారు. జాతీయ స్థాయిలో పార్టీ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
బీఆర్ఎస్ దేశ వ్యాప్త విస్తరణలో భాగంగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఏపీ..ఒడిశాలో కీలక చేరికలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 5న నాందేడ్ లో భారీ బహింరగ సభకు నిర్ణయించారు. ఫిబ్రవరి 17న హైదరాబాద్ లో మరో సభ జరగనుంది. ఇదే సమయంలో అటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..ఇటు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ భేటీ ప్రారంభం కానుంది.
ఈ పరిస్థితుల్లో పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపైన సీఎం కేసీఆర్ వారికి దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో జాతీయ స్థాయిలో బీజేపీ పోరాటం పైన కార్యచరణ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.
ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు జరగనుంది. ప్రగతిభవన్లో పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. పార్టీకి చెందిన లోక్ సభ..రాజ్యసభ సభ్యులను లంచ్ మీట్ కు రావాలని ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో పార్టీ సభ్యులు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
కేంద్రం ఫిబ్రవరి 1వ తేదీన 2023-24 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టనుంది. ముందుగా రేపు (సోమవారం) కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల అజెండా.. అన్ని పక్షాల అభిప్రాయాలను తెలుసుకోనుంది. సమావేశాల నిర్వహణ కోసం కేంద్రం అన్ని పార్టీల మద్దతు కోరనుంది. ఈ సమావేశంలోనే తెలంగాణకు సంబంధించిన అంశాలను ప్రస్తావించేందుకు టీఆర్ఎస్ ఎంపీలు సిద్దం అవుతున్నారు.
ఈ రోజు జరిగే సమావేశంలో తెలంగాణకు రావాల్సని నిధులు..ప్రాజెక్టులపై ఎంపీలకు సీఎం కేసీఆర్ నిర్దేశం చేయనున్నారు. ఇక, బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా భాగస్యామ్య పార్టీలతో కలిసి బీజేపీ పైన పోరాటం గురించి కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వామపక్షాలు.. ఆప్ పార్టీల ముఖ్యనేతలు బీఆర్ఎస్ సభకు హాజరై మద్దతు ప్రకటించారు.
ఫిబ్రవరి 17న సభకు జేఎంఎం, డీఎంకే పార్టీల సీఎంలు హాజరు కానున్నారు. అదే విధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు చేరికలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల సమయంలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉండే అవకాశం ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా కలిసి వచ్చే పార్టీలతో ఐక్య కార్యాచరణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి నేటి సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.