ఇక పోరు దారి... కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవడమే.... ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం
నీటి వాటాల పంపిణీ,జీఎస్టీ నిధుల జాప్యం తదితర అంశాలపై ఇటీవలి కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై బాహాటంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కేంద్రం తీరు సమాఖ్య స్పూర్తికి తూట్లు పొడిచేలా ఉందని ఇటీవలే ప్రధాని మోదీకి కూడా లేఖ రాసి తన అసహనాన్ని వ్యక్తపరిచారు. నిజానికి మొదటినుంచి కేంద్రంలో ఉన్న ఎన్డీయేతో కేసీఆర్ సఖ్యతనే పాటిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాల్సిందేనని తాజాగా నిర్ణయించారు. త్వరలో పార్లమెంటరీ సమావేశాల నేపథ్యంలో గురువారం పార్టీ ఎంపీలకు ఆయన దిశా నిర్దేశం చేశారు.
పార్లమెంటులో నిలదీయాలని...
కేంద్రం వైఖరిపై తాజా సమావేశంలో కేసీఆర్ తీవ్ర అసంతృప్తి,అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం నాన్చివేత ధోరణిని చూసీ చూసీ సహనం నశించిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక పార్లమెంటులో రాజీ లేని పోరాటం చేయాల్సిందేనని ఎంపీలతో చెప్పారు. రాష్ట్రానికి రావాల్సినవి పోరాడి సాధించుకుందామన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో కేంద్రం చిన్న చూపుని,నాన్చివేత ధోరణిని పార్లమెంటులో నిలదీయాలని ఎంపీలకు సూచించారు.
ఏడేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం...
రాజ్యాంగబద్దంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు,హామీల అమలులో కేంద్రం ఏడేళ్లుగా అన్యాయం చేస్తోందని తాజా సమావేశంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కృష్ణ జలాల వివాదాన్ని ఎటూ తేల్చకపోవడం కేంద్రం అసమర్థ వైఖరికి నిదర్శనమని.. ఆ కారణంగా తెలుగు రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొంది. జాతీయ రహదారులపై కూడా కేంద్రం మాటను నిలబెట్టుకోలేదని.... కనీసం మరమ్మత్తులకు కూడా దిక్కు లేదని ఆరోపించింది.
Recommended Video
నిరసన తెలిపాలని నిర్ణయం...
రాష్ట్రానికి కేటాయించిన యూరియాను కూడా పూర్తిగా ఇవ్వట్లేదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఆరోపించింది. రాష్ట్రానికి రావాల్సిన 22 నవోదయ పాఠశాలలపై కూడా కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదని మండిపడింది. వరంగల్ చేనేత పార్కుకు ఇప్పటివరకూ ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించింది. అలాగే రాష్ట్రంలో 8 ఎయిర్ స్ట్రిప్స్ నిర్మాణానికి ఇప్పటికీ అనుమతులు ఇవ్వట్లేదని ఆరోపించింది. జీఎస్టీ నిధులపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని... పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించింది. కేంద్రం తీసుకొచ్చే నూతన విద్యుత్ బిల్లును కూడా వ్యతిరేకించాలని కేసీఆర్ ఎంపీలకు సూచించారు.