ముఖ్యనేతలకు సీఎం కేసీఆర్ ఆహ్వానం : నేడు కీలక భేటీ - క్లారిటీ..!!
ప్రగతి భవన్ వేదికగా నేడు కీలక సమావేశం జరగనుంది. తన మంత్రివర్గంలోని మంత్రులతో పాటుగా 33 జిల్లాల పార్టీ అధ్యక్షులను ముఖ్యమంత్రి ప్రగతి భవన్కు ఆహ్వానించారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని పార్టీలోని కీలక నేతలకు తొలిసారి చెప్పేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధమయ్యారు. విజయ దశమి నాడు జాతీయ పార్టీని అధికారికంగా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దమవుతున్నారు. అందులో భాగంగా, దసర రోజున పార్టీ కార్యవర్గ సమావేశం- పార్టీ శాసనసభా పక్ష సమావేశాలు జరగనున్నాయి.
భారత వికాస సమితి గా పార్టీ పేరు
అందులో జాతీయ పార్టీకి అనుకూలంగా తీర్మానం చేయనున్నారు. జాతీయ నేతలను హైదరాబాద్ కు ఆహ్వానించారు. యూపీ మాజీ సీఎం ములాయంతో పాటుగా కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి వస్తున్నట్లు సమాచారం. వారి సమక్షంలో కేసీఆర్ తన జాతీయ పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
జాతీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశాలు, జెండా, అజెండాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు వివరించనున్నారు. భారత రాష్ట్ర సమితి పేరు ప్రధానంగా వినిపిస్తున్నా.. భారత వికాస సమితి పేరు ఖరారు చేసినట్లుగా తాజాగా ప్రచారంలోకి వచ్చింది.
పార్టీ ప్రకటన తర్వాత రాష్ట్రంలో జరగాల్సిన కార్యక్రమాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు తదితరాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం ఉంది.
పార్టీ ప్రకటన - కార్యాచరణ పై క్లారిటీ
తెలంగాణలో అధికారం - పార్టీ నాయకత్వం పైనా కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నారు. తెలంగాణ సీఎంగా కొనసాగుతూనే జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఉంటుందని ఇప్పటికే కేసీఆర్ చెబుతూ వచ్చారు. దీని పైన స్పష్టత ఇవ్వనున్నారు. తొలిసారి ఈ నిర్ణయాన్ని పార్టీలోని కీలక నేతలందరికీ ఆదివారం జరిగే సమావేశంలో చెప్పనున్నారు.
వారినుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. జాతీయ పార్టీ ప్రారంభించిన తర్వాత కూడా తొలి బహిరంగ సభను కరీంనగర్లోనే నిర్వహించాలని ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఢిల్లీలో కూడా ఒక బహిరంగ సభను నిర్వహించాలనే ఉద్దేశంతో ఉన్నారు.
పార్టీ ప్రకటన తరువాత ఉత్తరప్రదేశ్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రంలోను ఒక బహిరంగసభ నిర్వహించాలని, మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో మరో బహిరంగసభను ఏర్పాటుచేయాలని ఆలోచిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో రౌండ్టేబుల్ సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఉన్నారు.
మునుగోడు బై పోల్ బాధ్యతలపైనా
ఇతర రాష్ట్రాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో.. తెలంగాణలో అమలుచేస్తున్న రైతు బంధు, దళిత బంధు, పింఛన్లు, రైతులకు ఉచిత విద్యుత్ వంటిసంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలపైనా మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో జరిగే సమావేశంలో కేసీఆర్ చర్చించనున్నట్లు సమాచారం.
ఈ ఉప ఎన్నికలు అత్యంత కీలకమైనందున మునుగోడులో ఎవరెవర్ని ఎలా మోహరించాలన్నదానిపైనా ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు. మంత్రులు - పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ మునుగోడు బాధ్యతలు అప్పగించనున్నారు. అటు జాతీయ స్థాయిలో..ఇటు తెలంగాణలో బీజేపీని లక్ష్యంగా చేసుకోవటంతో పాటుగా కాంగ్రెస్ తో పార్టీ వైఖరి పైనా సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఈ రోజు జరిగే సమావేశం కీలకంగా మారుతోంది.