స్పీకర్ వ్యవస్థను నీరు గార్చిన కేసీఆర్..! సుప్రీంకోర్టులో తేల్చుకుందామంటున్న టీపిసిసి..!!
హైదరాబాద్ : చంద్రశేఖర్ రావు కు తొత్తులా స్పీకర్ వ్యవహరించారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఘాటుగా వ్యాఖ్యానించారు. గాంధీ భవన్లో మాట్లాడిన ఆయన తమకు అందుబాటులో కి రాని స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఆ 12 మంది ఎమ్మెల్యేలకు ఎలా అందుబాటులో వచ్చాడని ప్రశ్నించారు. నిబంధనలు పాటించకుండా స్పీకర్ సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసాడని మండిపడ్డారు షబ్బీర్ ఆలీ.
రాజ్యాంగ బద్దమయిన అత్యుత్తమ పదవిలో ఉన్న గవర్నర్ , స్పీకర్ ఇద్దరు రాజ్యంగ నిబంధనలను పట్టించుకోకపోతె ఎలా అని అయన ప్రశ్నించారు. ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఓక్కో తేదిన మా పార్టీ వీడి టిఆర్ఎస్ లో చేరారు. మొదట కొంద మంది టిఆర్ఎస్ లో చేరినపుడే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసినా దానిని పట్టించుకోలేదని, అసలు తాము ఇచ్చిన ఫిర్యాదునే స్పీకర్ బుట్టదాఖలు చేసారని షబ్బీర్ ఆలీ ఆవేదన వ్యక్తం చేశారు.
వైయస్ హాయాంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల ను ప్రోత్సహించలేదా అంటూ టిఆర్ఎస్ ఎదురు దాడి చేస్తుందని ఆయన అన్నారు. అప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యే ల సభ్యత్వాలను అప్పటి స్పీకర్ రద్దు చేస్తే ఉప ఎన్నికలు వచ్చాయని ఆయన గుర్తు చేసారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నాయకులు మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రజా స్వామ్యంలో వ్యక్తులు శాశ్వతం కాదని, వ్యవస్థే ముఖ్యమని, ఆ వ్యవస్థ లను నాశనం చేస్తే భవిష్యత్ లో అదికార పార్టీ నాయకులకే ప్రమాదమని హెచ్చరించారు.
ఆపరేషన్ ఆకర్ష్ ను టిఆర్ఎస్ మార్చ్ లో ప్రారంభించి నిన్న ముగించింది తెలిపారు. ఇలాంటి రాచరిక పాలన కావాలో, ప్రజాస్వామ్య పాలన కావాలో ప్రజలే నిర్ణయిస్తారని, న్యాయం కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్తాం అక్కడ కూడా న్యాయం జరగకపోతే ప్రజా కోర్ట్ కు వెళ్తామని షబ్బీర్ అలీ అన్నారు.