కాంగ్రెస్ దూకుడు, ఈసీ సూచన: సెప్టెంబర్ 6నే అసెంబ్లీ రద్దు ఎందుకు, కేసీఆర్కు వారి సూచన?
Recommended Video
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ రద్దు ప్రచారం నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బుధవారం భేటీ అయ్యారు. ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు అంశాలపై చర్చించారు. జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చునని ఈసీ తెలిపింది.
విదేశాల్లో ఉంటున్న భారత పౌరులు కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చునని తెలిపింది. సెప్టెంబర్ 1న నమూనా ఓటర్ జాబితాను ఈసీ ప్రకటించింది. అక్టోబర్ 31వ తేదీ వరకు సలహాలు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. నవంబర్ 30వ తేదీ లోపు ఈసీ అభ్యంతరాలు పరిష్కరించనున్నది.
కాంగ్రెస్ మేనిఫెస్టో ఇలా
మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ ముందస్తు వార్తలతో దూకుడు పెంచింది. ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. గాంధీ భవన్లో మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఇళ్లు లేని కుటుంబాలకు రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు రూ.1 లక్ష అదనం. ఇందిరమ్మ ఇళ్లలో రూ.2 లక్షలతో అదనంగా మరో గది. మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు. కళ్యాణ్ లక్ష్మితో పాటు బంగారు లక్ష్మి కొనసాగింపు. దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు. దివ్యాంగుల శాఖ విలీనం రద్దు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచిత బీమా సదుపాయం.
కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ రద్దు?
మరోవైపు రేపు ఉదయం అందరు మంత్రులు అందుబాటులో ఉండాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ రద్దుపై అధికారిక ప్రకటన వెలువడనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మంత్రులు పెండింగ్ పనుల క్లియరెన్స్ పైన దృష్టి సారించారు. జిల్లాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. ఎల్లుండి (శుక్రవారం) హుస్నాబాద్లో సభతో కేసీఆర్ ఎన్నికల శంఖారావం ప్రారంభం కానుంది. 50 రోజుల్లో 100 సభలు నిర్వహించేలా ప్రణాళికలు నిర్వహించారు. వీటికి ప్రజా ఆశీర్వాద సభలుగా నామకరణం చేశారు.
కేసీఆర్కు కలిసొచ్చే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం
కేసీఆర్ సమావేశాలకు ప్రజా ఆశీర్వాద సభలుగా నామకరణం చేసినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సభలతో ఎన్నికల సమర శంఖం పూరిస్తున్నామని తెలిపారు. ప్రగతి నివేదన సభలో నాలుగున్నరేళ్ల ప్రగతిని చెప్పామని తెలిపారు. ప్రజా ఆశీర్వాద సభలతో అయిదేళ్ల మేనిఫెస్టోను వివరిస్తామని చెప్పారు. సెంటిమెంట్గా ఈశాన్య ప్రాంతాల నుంచి ప్రచారం అన్నారు. కేసీఆర్కు కలిసి వచ్చే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం అన్నారు.
సెప్టెంబర్ 6నే అసెంబ్లీ రద్దు ఎందుకు?
వచ్చే ఎన్నికల్లో తెరాస 100 సీట్లలో గెలుస్తుందని హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ రద్దుపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. గతంలోను కేసీఆర్ ఈ ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారని చెప్పారు. ఇదిలా ఉండగా, కేసీఆర్ సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు చేయడానికి ఓ కారణం కూడా ఉందని చెబుతున్నారు. కేసీఆర్ జ్యోతిష్యాన్ని నమ్ముతారు. వారి సలహా మేరకు, లక్కీ నెంబర్ 6 కాబట్టి అదే రోజు అసెంబ్లీ రద్దు చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఆదివారం ప్రగతి నివేదన సభలోనే అసెంబ్లీ రద్దుపై ప్రకటన చేస్తారని భావించారు. కానీ తన లక్కీ నెంబర్ 6 కాబట్టి, సెప్టెంబర్ 6న రద్దు చేయాలని జ్యోతిష్యుల సూచన మేరకు నిర్ణయం మార్చుకున్నట్లుగా తెలుస్తోందని అంటున్నారు.